ముద్రా లోన్స్ పేరుతో భారీ మోసం..! సోషల్ మీడియా యాడ్స్తో ఉచ్చులోకి దింపి.. ఆ తర్వాత..
కేంద్రం యువతను ప్రోత్సహించే ముద్రా లోన్ పథకాన్ని కొందరు కేటుగాళ్లు మోసాలకు వాడుకుంటున్నారు. నకిలీ యాప్లు, ఫోన్ కాల్స్తో ప్రాసెసింగ్, ఇన్సూరెన్స్ ఛార్జీల పేరుతో లక్షలకు పైగా డబ్బులు దోచుకుంటున్నారు. హైదరాబాద్లో ఇలాంటి ఐదుగురు సభ్యుల ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.

ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, యువతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముద్రా రుణాల పథకం తీసుకొచ్చింది. అయితే కొంతమంది కేటుగాళ్లు ఈ ముద్ర లోన్స్ పేరిట భారీ మోసానికి పాల్పడుతూ జనం నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. అలాంటి ఓ ముఠాను తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 8 మొబైల్ ఫోన్లు, 10 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన 36 ఏళ్ల మహిళ నవంబర్ 6న ఇన్స్టాగ్రామ్లో ఓ లోన్ యాప్ ప్రకటన చూసి దానిని ఓపెన్ చేశారు. ఆ వెంటనే క్లోజ్ కూడా చేసేశారు. మరుసటి రోజు ఆమెకు 97736 03466 నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను ముద్రా లోన్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నానని, తన పేరు కిలా పవన్ కుమార్ అని పరిచయం చేసుకున్నాడు. మీకు రూ.3 లక్షల రుణం మంజూరైందని చెప్పాడు.
ప్రాసెసింగ్ ఫీజు ఏం ఉండదని చెప్పి ఆధార్, పాన్ కార్డు వివరాలు తీసుకున్నాడు. అయితే లోన్కి ఇన్సూరెన్స్ ఛార్జీలు రూ.7200, టీడీఎస్ రూ.15 వేలు అవుతుందని చెప్పాడు. రూ.3 లక్షల లోన్ సబ్సిడీతో వస్తుంది కదా అని ఆ మహిళ ఆ డబ్బును చెల్లించింది. ఇలా రకరకాల కారణాలు చెప్పి బాధితురాలి నుంచి రూ. 1.08 లక్షలు వసూలు చేశాడు. ఎన్ని రోజులైనా లోన్ డబ్బులు మాత్రం ఆమె ఖాతాలో జమ కాలేదు. దాంతో బాధితురాలు తనకు లోన్ వద్దని చెప్పి ఇచ్చిన డబ్బును వాపసు ఇవ్వమని అడుగగా క్యాన్సిలేషన్ ఫీజు పేర మరింత డబ్బు డిమాండ్ చేశాడు. అప్పుడు జరిగిన మోసాన్ని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పక్కాగా ఆధారాలు సేకరించి ఈ మోసానికి పాల్పడ్డ వరంగల్ జిల్లాకు చెందిన బోచు అరుణ్, గడ్డం భరత్, సామర్ల తిరుపతి, వెల్పుగొండ తరుణ్, చుక్క శ్యామ్ లను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇలా ట్రైనింగ్ తీసుకున్న అయిదుగురు ప్రతీరోజూ 180 నుంచి 200 ఫోన్ కాల్స్ చేస్తూ తమ వలలో చిక్కిన వారి నుంచి డబ్బు గుంజుతున్నారు. ఈ మోసాలు మొదలు పెట్టటానికి ముందు అయిదుగురు నిందితులు కూలీ పని చేస్తూ జీవనం గడిపేవారని డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. సోషల్ మీడియాలో సులభంగా లోన్లు ఇస్తామంటూ వచ్చే ప్రకటనలను ప్రజలు నమ్మవద్దని పోలీసులు సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు. దాంతోపాటు cybercrime.gov.in లో ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
