
భారతదేశంలో బంగారు రుణ మార్కెట్ రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలకు (NBFCలు) కొత్త నియమాలు, నిబంధనలను ప్రకటించింది. దీంతో రుణగ్రహీతలకు సౌలభ్యం, భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. వచ్చే ఏడాది కాలంలో ఎన్బిఎఫ్సిలు దాదాపు 3,000 బంగారు రుణ శాఖలను ప్రారంభించనున్నాయి. బంగారం ధరల పెరుగుదల కారణంగా ప్రజలు ఎక్కువ రుణాలు తీసుకుంటున్నందున రుణ మార్కెట్ను విస్తరించే చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ చివరి నాటికి బంగారు రుణ మార్కెట్ రూ.14.5 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం.
ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికీ బంగారు రుణాలలో అగ్రగామిగా ఉన్నప్పటికీ, రైతులు, వ్యాపారులు, సామాన్యులకు తక్షణమే డబ్బు అందించడానికి NBFCలు కొత్త శాఖలను తెరుస్తున్నాయి. ముత్తూట్ ఫైనాన్స్, IIFL ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ వంటి పెద్ద NBFCలు కలిసి 1,800 కి పైగా కొత్త శాఖలను ప్రారంభించాలని యోచిస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్ ఒక్కటే 2027 నాటికి 900 శాఖలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త సంస్థ, L&T ఫైనాన్స్ ఈ సంవత్సరం 200 శాఖలను ప్రారంభించాలని యోచిస్తోంది.
వ్యవసాయదారులు, చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి బంగారు రుణాలు పెద్ద సహాయంగా ఉన్నాయి. IIFL ప్రకారం, 70శాతం బంగారు రుణాలను రైతులు, చిన్న వ్యాపారులు ఉపయోగిస్తున్నారు. మిగిలిన రుణాలను వివాహాలు, గృహ మరమ్మతులు, అత్యవసర ఖర్చుల కోసం ఉపయోగిస్తారు. జీతం పొందే ఉద్యోగులు స్వల్పకాలిక ఫైనాన్సింగ్ కోసం కూడా బంగారు రుణాలను ఉపయోగిస్తారు.
కొత్త నిబంధనల ప్రకారం, బంగారు రుణ శాఖలను ఏర్పాటు చేయడానికి తప్పనిసరి భద్రతా ఏర్పాట్లు ఉండాలి – స్ట్రాంగ్ రూమ్, CCTV, సెన్సార్లు మొదలైనవి. ప్రతి శాఖ ఖర్చు రూ.8–20 లక్షలు. శాఖలు లాభదాయకంగా మారడానికి 1.5–2 సంవత్సరాలు పడుతుంది.
ICRA రేటింగ్స్ ప్రకారం బంగారం ధరలు పెరగడం, ప్రజల విశ్వాసం పెరగడం వల్ల FY26 నాటికి NBFCల బంగారు రుణ ఆస్తులు 30–35శాతం పెరుగుతాయని అంచనా. దేశంలో ప్రజలు తమ ఇళ్లలో పెద్ద మొత్తంలో ఉపయోగించని బంగారం కూడా ఈ మార్కెట్కు మద్దతు ఇస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి