AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC: ఆ ఒక్క రాజీనామాతో రూ.1.5 లక్షల కోట్ల నష్టం! అది కూడా కేవలం 3 రోజుల్లోనే..

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు ఛైర్మన్ రాజీనామాతో మూడు రోజుల్లో 12 శాతం పడిపోయాయి. 'విలువలు, నైతికత'పై విభేదాల కారణంగా అటాను చక్రవర్తి ఆకస్మిక రాజీనామా చేశారు. దీంతో బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 1.5 లక్షల కోట్లకు పైగా తగ్గింది. ఈ అనూహ్య పరిణామం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసింది.

HDFC: ఆ ఒక్క రాజీనామాతో రూ.1.5 లక్షల కోట్ల నష్టం! అది కూడా కేవలం 3 రోజుల్లోనే..
Hdfc Bank
SN Pasha
|

Updated on: Mar 24, 2026 | 6:30 AM

Share

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్‌ షేర్లు వరుసగా మూడు ట్రేడింగ్ రోజుల్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చక్రవర్తి ఆకస్మిక రాజీనామా నేపథ్యంలో బ్యాంక్ షేర్లు దాదాపు 12 శాతం పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదలో సుమారు రూ.1.5 లక్షల కోట్ల మేర క్షీణత నమోదైంది.

సోమవారం ట్రేడింగ్‌లో మాత్రమే ఈ స్టాక్ బిఎస్‌ఇలో 4.70 శాతం పడిపోయి రూ.743.75 వద్ద ముగిసింది. ఒక దశలో ఇది 5 శాతం క్షీణించి రూ.740.95 వరకు చేరి, గత 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. అదే సమయంలో ఎన్‌ఎస్‌ఇలో కూడా స్టాక్ 4.65 శాతం పడిపోయి రూ.744.15 వద్ద ముగిసింది. గత మూడు రోజుల్లో మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,52,064 కోట్లకు పైగా తగ్గి రూ.11.44 లక్షల కోట్లకు చేరింది.

ఈ పతనానికి ప్రధాన కారణం చక్రవర్తి రాజీనామానేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన తన రాజీనామా లేఖలో విలువలు, నైతికత విషయంలో భేదాభిప్రాయాలను ప్రస్తావించడం గమనార్హం. అయితే బ్యాంక్ యాజమాన్యం ఈ కారణాలను ఆశ్చర్యకరమైనవిగా అభివర్ణిస్తూ, ఆయన ఎలాంటి నిర్దిష్ట వివరాలు వెల్లడించలేదని తెలిపింది. చక్రవర్తి రాజీనామా అనంతరం బ్యాంక్ గ్రూప్‌లో సీనియర్ సభ్యుడైన కేకీ మిస్త్రీ తాత్కాలిక ఛైర్మన్‌గా నియమితులయ్యారు. బ్యాంక్ కార్యకలాపాలు, పాలన వ్యవస్థ స్థిరంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఈ రాజీనామా వెనుక పెద్దగా గవర్నెన్స్ సమస్యలు ఉన్నాయని తాను భావించడం లేదని పేర్కొన్నారు.

అయితే పదవీకాలం పూర్తికాకముందే పార్ట్‌టైమ్ ఛైర్మన్ మధ్యలో రాజీనామా చేయడం ఇదే తొలిసారి కావడం మార్కెట్‌లో ఆందోళనలకు దారితీసింది. కార్పొరేట్ గవర్నెన్స్‌పై ప్రశ్నలు తలెత్తడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమై, భారీగా అమ్మకాలకు దిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా ఈ పరిణామం తాత్కాలిక అనిశ్చితిని సృష్టించినప్పటికీ, బ్యాంక్ ప్రాథమిక వ్యాపార కార్యకలాపాలు స్థిరంగానే ఉన్నాయని యాజమాన్యం స్పష్టం చేస్తోంది. అయితే, మార్కెట్ నమ్మకం తిరిగి సాధించడానికి సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us