
అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు కీలకమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ తాజాగా ప్రతిపాదించిన కొత్త నిబంధనల ప్రకారం, H-1B వీసా కింద నియమించుకునే విదేశీ ఉద్యోగులకు చెల్లించాల్సిన కనీస వేతనాలను భారీగా పెంచాలని యోచిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న వేతన ప్రమాణాలు దాదాపు 20 ఏళ్ల క్రితం రూపొందించబడినవని, అవి అమెరికా కార్మికుల వేతనాలను సరైన స్థాయిలో రక్షించడంలో విఫలమయ్యాయని కార్మిక శాఖ పేర్కొంది. అందుకే ప్రవేశ స్థాయి నుంచి అత్యంత అనుభవజ్ఞుల వరకు ఉన్న నాలుగు వేతన స్థాయిలను 20 శాతం నుంచి 33 శాతం వరకు పెంచే ప్రతిపాదనలు తీసుకొచ్చింది.
కొత్త ప్రతిపాదనల ప్రకారం ప్రవేశ స్థాయి H-1B ఉద్యోగులకు కనీస వేతనం సుమారు 97,746 డాలర్లుగా ఉండొచ్చు. అలాగే లెవెల్-II ఉద్యోగులకు 123,212 డాలర్లు, లెవెల్-IIIకు 147,333 డాలర్లు, లెవెల్-IVకు 175,464 డాలర్ల వరకు కనీస వేతనాలను పెంచాలని సూచించింది. ఈ వేతనాలు నగరం, ఉద్యోగ రంగాన్ని బట్టి మారవచ్చని అధికారులు తెలిపారు. ఈ మార్పులు H-1Bతో పాటు H-1B1, E-3, PERM కార్మిక ధృవీకరణ కార్యక్రమాలకు కూడా వర్తించే అవకాశం ఉంది. అమెరికా కార్మికుల కంటే తక్కువ వేతనాలతో విదేశీయులను నియమించుకునే పరిస్థితిని తగ్గించడమే ఈ చర్యల ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.
అయితే ఈ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. పెద్ద కంపెనీలు ఈ పెరిగిన వేతనాలను భరించగలిగినా, చిన్న సంస్థలు ఫ్రెషర్లను లేదా ఎంట్రీ-లెవెల్ ఉద్యోగులను నియమించుకోవడం కష్టమవుతుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అమెరికా ఉద్యోగులకు ఇది రక్షణ కల్పిస్తుందని కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ప్రజాభిప్రాయాల స్వీకరణ ప్రక్రియ మే 26 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. గతంలో డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కూడా H-1B వేతన నియమాల్లో మార్పులు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి