LPG Gas Crisis: వంట గ్యాస్ రంగంలో పెను మార్పు.. ఎల్పీజీ నుండి పీఎన్జీ వైపు అడుగులు.. కేంద్రం బిగ్ అలర్ట్!
LPG Gas Crisis: ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తీవ్ర సంక్షోభం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. వంట గ్యాస్ రంగంలో కేంద్రం సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. వినియోగదారులకు కీలక సూచనలు చేస్తోంది..

LPG Gas Crisis: భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంధన వినియోగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పర్యావరణ హితమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఇంధనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో, ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG) వాడకాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేస్తోంది. ఎక్కడైతే పీఎన్జీ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో, అక్కడ వినియోగదారులు తప్పనిసరిగా మారాలని కేంద్రం ఆదేశించింది.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు:
వినియోగదారులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఆకర్షణీయమైన రాయితీలను ప్రకటిస్తోంది. పీఎన్జీ కనెక్షన్ తీసుకునే వారికి సెక్యూరిటీ డిపాజిట్ను పూర్తిగా రద్దు చేయడమే కాకుండా, మొదటి గ్యాస్ బిల్లులో రూ. 500 వరకు ఉచితంగా అందిస్తోంది. ఇది సామాన్యులకు ఎంతో ఊరటనిచ్చే అంశం.
ఎల్పీజీ కంటే పీఎన్జీ ఎందుకు మేలు?
- ఆర్థిక ప్రయోజనం: ఎల్పీజీతో పోలిస్తే పీఎన్జీ దాదాపు 10% నుండి 15% వరకు చౌకగా ఉంటుంది.
- భద్రత: సిలిండర్ల నిల్వ అవసరం లేదు కాబట్టి ప్రమాదాల ముప్పు తక్కువ. పైపుల ద్వారా గ్యాస్ సరఫరా ఒత్తిడి తక్కువగా ఉండటం వల్ల ఇది సురక్షితం.
- సౌకర్యం: గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం, అది ఎప్పుడు వస్తుందో అని వేచి చూడటం వంటి ఇబ్బందులు ఉండవు. ఇది 24×7 అంతరాయం లేకుండా అందుబాటులో ఉంటుంది.
- సులభమైన చెల్లింపులు: విద్యుత్ బిల్లుల మాదిరిగానే దీనిని వాడుకున్న తర్వాతే బిల్లు చెల్లించవచ్చు. గూగుల్ పే, ఫోన్ పే వంటి డిజిటల్ మాధ్యమాల ద్వారా సులభంగా బిల్లులు కట్టవచ్చు.
ఎలా మార్చుకోవాలి?
వినియోగదారులు తమ నగరంలో పీఎన్జీ అందుబాటులో ఉందో లేదో అధికారిక వెబ్సైట్లలో తనిఖీ చేయవచ్చు. గెయిల్ (GAIL), ఐజీఎల్ (IGL) వంటి సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకుంటే, సిబ్బంది వచ్చి మీ ఇంట్లో కనెక్షన్ ఏర్పాటు చేస్తారు. దేశాన్ని కాలుష్య రహితంగా మార్చే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇంధన భద్రతలో ఒక కొత్త అధ్యాయం.
పీఎన్జీకి మారడానికి 3 నెలల గడువు
పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, మార్కెటింగ్, ఆయిల్ రిఫైనరీ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, పీఎన్జీని ప్రోత్సహించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా కంపెనీలు రూ. 500 వరకు ఉచిత గ్యాస్ అందిస్తూ, సెక్యూరిటీ ఫీజులను మాఫీ చేస్తున్నాయని తెలిపారు. వీలైనంత వరకు గృహస్థులు ఎల్పిజి నుండి పీఎన్జీకి మారేలా ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. “PNG కనెక్షన్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని వినియోగదారులకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా తెలియజేయబడుతుందని, LPG వినియోగదారులకు PNGకి మారడానికి 3 నెలల గడువు ఇస్తున్నట్లు శర్మ అన్నారు.
ఇప్పటివరకు సుమారు 2.2 లక్షల మంది వినియోగదారులు ఇప్పటికే ఎల్పిజి నుండి పిఎన్జికి మారారు. పనులను సులభతరం చేయడానికి, ఢిల్లీలో రోడ్డు పునరుద్ధరణ ఛార్జీలను మాఫీ చేశారు. ఇప్పుడు పైప్లైన్లను 24 గంటల్లోనే వేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఎల్పీజీ కొరత లేదు: ప్రభుత్వం
దేశంలో ఎల్పీజీ కొరత లేదని ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. సరఫరా స్థిరంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుజాత శర్మ అన్నారు. “గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి కొరత లేదు,” అని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, వినియోగదారులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: LPG Gas: సంచలన నిర్ణయం.. వీరికి నిలిచిపోనున్న గ్యాస్ బుకింగ్ సేవలు..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
