
భారతదేశంలో వేతన జీవుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారి ఆరోగ్య భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి మూల వేతనం నుంచి కొంతమేర మినహాయించుకుని ఈఎస్ఐ సేవలను అందిస్తుంది. ఆయా ఆస్పత్రుల్లో ఖర్చుతో సంబంధం లేకుండా ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు సేవలను అందిస్తున్నారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఈఎస్ఐ కార్పొరేషన్ 191వ సమావేశంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా 30 ఈఎస్ఐసీ ఆసుపత్రుల్లో కీమోథెరపీ సేవలను ప్రారంభించింది. ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) లబ్దిదారులకు చికిత్సను సులభతరం చేయడానికి ఈ సేవలను ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక, ఉపాధి, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
అంతర్గత కీమోథెరపీ సేవల ప్రారంభంతో బీమా చేసిన కార్మికులు, వారిపై ఆధారపడినవారు దేశవ్యాప్తంగా 30 ఆసుపత్రులలో మెరుగైన క్యాన్సర్ చికిత్సను సులభంగా పొందగలుగుతారు.కేంద్ర మంత్రి ఈఎస్ఐసీ డ్యాష్బోర్డ్లతో కూడిన కంట్రోల్ రూమ్ను కూడా ప్రారంభించారు. ఇది ఈఎస్ఐసీ ఆసుపత్రుల్లో వనరులు, పడకలకు సంబంధించిన మెరుగైన పర్యవేక్షణ, కొనసాగుతున్న నిర్మాణ ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి మొదలైన వాటిని నిర్ధారిస్తుంది.
ఈఎస్ఐసీ హాస్పిటల్స్లో నైపుణ్యం కలిగిన వైద్య నిపుణుల లభ్యతను నిర్ధారించడానికి ఈఎస్ఐ కార్పొరేషన్ వైద్య విద్య రంగంలో తన పనిని మెరుగుపరచాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అవసరాన్ని అంచనా వేసిన తర్వాత కొత్త ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు. ఇప్పటి వరకు 8 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలు, 2 నర్సింగ్ కాలేజీలు, ఒక పారా మెడికల్ కాలేజీని ఈఎస్ఐసీ ద్వారా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సూత్రప్రాయంగా 15 కొత్త ఈఎస్ఐ హాస్పిటల్స్, 78 ఈఎస్ఐ డిస్పెన్సరీలు, ఈఎస్ఐ హాస్పిటల్, బెల్టోలా (అస్సాం), ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ (కేకే నగర్, చెన్నై, తమిళనాడు), ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ఫరీదాబాద్లో బెడ్ స్ట్రెంగ్త్ పెంపుదల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..