
ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సాంప్రదాయ కరెన్సీల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ, పెట్టుబడిదారులు వెంటనే అప్రమత్తం కావాలని ఆయన హెచ్చరించారు. బంగారం ధరలు ఒక్కరోజులోనే ఏకంగా 128 డాలర్లు పెరిగిందని చెప్పారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనపడటం, పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు ఇన్వెస్టర్లను సురక్షిత ఆస్తి అయిన బంగారం వైపు పరుగులు తీయిస్తున్నాయి.
కేవలం బంగారమే కాదు, వెండి మరియు బిట్కాయిన్ ధరలు కూడా త్వరలోనే భారీగా ఎగబాకనున్నాయని కియోసాకి జోస్యం చెప్పారు. వెండిని ఆయన పేదవాడి బంగారం అని పిలుస్తారు. పారిశ్రామికంగా వెండికి ఉన్న డిమాండ్, విలువైన లోహంగా దీనికున్న గుర్తింపు వల్ల ఇది బంగారం కంటే వేగంగా పెరిగే అవకాశం ఉంది.బిట్కాయిన్ను ఆయన డిజిటల్ గోల్డ్గా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వాల నియంత్రణలో లేని కరెన్సీ కావడంతో బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం తగ్గినప్పుడు బిట్కాయిన్ విలువ విపరీతంగా పెరుగుతుందని ఆయన నమ్ముతున్నారు.
రాబర్ట్ కియోసాకి గత కొంతకాలంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలను, డాలర్ ముద్రణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన విశ్లేషణ ప్రకారం పేపర్ కరెన్సీని ఆయన ఫేక్ మనీ అని పిలుస్తారు. బంగారం, వెండి, బిట్కాయిన్, రియల్ ఎస్టేట్లను మాత్రమే రియల్ మనీగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అప్పుల భారం పెరిగిపోవడంతో భారీ ఆర్థిక సంక్షోభం వచ్చే సూచనలు ఉన్నాయని, ఆ సమయంలో ఈ మూడు ఆస్తులు మాత్రమే ఇన్వెస్టర్లను కాపాడతాయని ఆయన వాదన.
సాధారణ సేవింగ్స్ ఖాతాల్లో డబ్బును దాచుకోవడం కంటే విలువ పెరిగే ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడమే తెలివైన పని అని కియోసాకి పదే పదే చెబుతుంటారు. మార్కెట్ ఒడిదుడుకుల సమయంలో బంగారం స్థిరత్వాన్ని ఇస్తే, వెండి, బిట్కాయిన్ అధిక లాభాలను ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు. కియోసాకి అంచనాలు ఎప్పుడూ కాస్త దూకుడుగా ఉంటాయని పేరుంది. అయితే ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు గమనిస్తే ఆయన చెప్పినట్లుగా లోహాల ధరలు పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి.
GOLD booms $128 in one day.
Better news is silver and Bitcoin to blast off.
Hang on.
— Robert Kiyosaki (@theRealKiyosaki) March 2, 2026