
బంగారం అంటే ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. మహిళలు, పురుషులు అనే సంబంధం లేకుండా.. గోల్డ్ను అందరూ ఇష్టపడతారు. ఇక ప్రపంచంలోనే భారతీయులకు బంగారం అంటేనే ఒక ప్రత్యేక సెంటిమెంట్ అని చెప్పవచ్చు. దీంతో ప్రతీఒక్కరి ఇళ్లల్లో తప్పనిసరిగా ఎంతోకొంత గోల్డ్ అనేది ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో వీటిని విక్రయించి తమ ఆర్ధిక అవసరాలను తీర్చుకుంటారు. ఇక పెళ్లిళ్లు, పండుగలు లాంటివి వస్తే బంగారం ధరించి మురిసిపోతుంటారు. కొంతమంది ధరించేందుకు కొనుగోలు చేస్తే.. మరికొంతమంది ఇప్పుడు కొంటే భవిష్యత్తులో ధర పెరగడం వల్ల భారీ ఆదాయం వస్తుందని పెట్టుబడి రూపంలో కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం మంచిదా..? లేదా డిజిటల్ గోల్డ్, ఈటీఎఫ్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెట్టుబడి పెట్టడం మంచిదా? అనేది తెలుసుకుందాం.
బంగారాన్ని ఆభరణాల రూపంలో కొంటే తరుగు, మేకింగ్ ఛార్జీలు, ట్యాక్సులు, మజూరీ వంటి అదనపు ఖర్చులు ఉంటాయి. ఇక డిజైన్, షాపును బట్టి ధరలు మారుతూ ఉంటాయి. బంగారం విలువతో పాటు ఈ అదనపు ఖర్చుల భారం కూడా పడుతుంది. మీరు అమ్మాలనుకుంటే అదనపు ఖర్చులు తిరిగి రావు. దీంతో ఆభరణాల రూపంలో పెట్టుబడిగా ఉంచాలనుకుంటే కొంత నష్టం జరుగుతుంది. పెట్టుబడి కోసం ఆభరణాలను కొనడం కాకుండా నాణేలు, బిస్కెట్లను కొనుగోలు చేయడం మంచిది. వీటికి డిజైన్, ఇతర చార్జీలు ఉండవు. దీని వల్ల అసలు ధరకే బంగారం లభిస్తుంది. తిరిగి విక్రయించాలనుకున్నా మీకు పెద్దగా నష్టం ఉండదు.
ఇక గోల్డ్ ఈటీఎఫ్, బాండ్ల రూపంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇక ఆర్బీఐ జారీ చేసే సావరిన్ బాండ్ కూడా మంచి ఎంపిక. వీటి ద్వారా బంగారం పెరిగితే మీకు లాభంతో పాటు వడ్డీ కూడా లభిస్తుంది. బంగారం ధర కదలికలను బట్టి వీటి రేటు మారవచ్చు. ఇక డిజిటల్ గోల్డ్ను కొనుగోలు చేయడం కూడా మంచి ఆప్షన్. బంగారం ధర పెరిగినప్పుడు మీకు మంచి ఆదాయం లభిస్తుంది. ఇక మార్కెట్లో అనేక గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వీటిల్లో పెట్టుబడి పెట్టినా దీర్థకాలంలో అధిక ఆదాయం పొందే అవకాశముంది. నగల రూపంలో కాకుండా ఈటీెఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ వంటి మార్గాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభం జరుగుతుంది. ఇప్పట్లో చాలామంది ఈ మార్గాల ద్వారా బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇది బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు పెరిగిపోతున్నారుజ