
సంస్థలలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ పీఎప్ ఉండడం కామన్. ఇది అత్యవసర సమయాల్లో ఆదుకునే బంగారు నిధి వంటిది. పీఎఫ్కు సంబంధించి ఈపీఎఫ్వో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటుంది. మీరు పీఎఫ్కి సంబంధించి ఏదైనా పని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈపీఎఫ్ఓ తన ఆన్లైన్ పోర్టల్లో మూడు రోజుల పాటు కొన్ని కీలక సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సాఫ్ట్వేర్, డేటాబేస్ అప్గ్రేడేషన్ పనుల కారణంగా ఈ తాత్కాలిక అంతరాయం కలగనుంది. నివేదికల ప్రకారం.. జూన్ 26 అర్ధరాత్రి 12 గంటల నుండి జూన్ 28 రాత్రి 11:59 గంటల వరకు ఈపీఎఫ్ఓ పోర్టల్లో పీఎఫ్ క్లెయిమ్లకు సంబంధించిన సేవలు అందుబాటులో ఉండవు. మళ్లీ జూన్ 29 నుంచి అన్ని సేవలు యథావిధిగా, మరింత వేగంగా అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.
కొత్త క్లెయిమ్లు: ఈ 3 రోజుల పాటు ఖాతాదారులు కొత్తగా ఎలాంటి పీఎఫ్ క్లెయిమ్లను సబ్మిట్ చేయలేరు.
పాత క్లెయిమ్ల ప్రాసెసింగ్: ఇప్పటికే దాఖలు చేసిన క్లెయిమ్ల ప్రాసెసింగ్ కూడా తాత్కాలికంగా నిలిచిపోతుంది. దీనివల్ల పాత క్లెయిమ్ల సెటిల్మెంట్కు మరికొన్ని రోజులు అదనంగా సమయం పట్టే అవకాశం ఉంది.
మొబైల్ ద్వారా పీఎఫ్ సేవలను అందించే ప్రభుత్వ అధికారిక ఉమాంగ్ యాప్ సేవలు కూడా మెయింటెనెన్స్ కారణంగా జూలై 2 వరకు ప్రభావితం కానున్నాయి. దీనివల్ల యాప్లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం, క్లెయిమ్ స్టేటస్ చూడటం, యూఏఎన్ సేవలు, జీవన్ ప్రమాణ్ పత్ర వంటి సేవలకు ఆటంకం కలగనుంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం 2025-26 కి గానూ ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.25 శాతం వడ్డీ రేటును ఖరారు చేసింది. అర్హులైన ఖాతాదారులందరికీ త్వరలోనే ఈ వడ్డీ జమ కానుంది.
ఆన్లైన్ పోర్టల్ లేదా యాప్ పని చేయకపోయినా.. ఖాతాదారులు ఈ క్రింది ప్రత్యామ్నాయాల ద్వారా సులభంగా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
మిస్డ్ కాల్ ద్వారా: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406 కి మిస్డ్ కాల్ ఇస్తే ఉచితంగా బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి.
SMS ద్వారా: మీ మొబైల్ నుండి 7738299899 నంబర్కు EPFOHO UAN ENG అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఒకవేళ తెలుగులో వివరాలు కావాలంటే చివరి మూడు అక్షరాలను TEL గా మార్చాలి.