EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు నెలకు రూ.7,500..! పెన్షన్ పెరుగుతుందా..? కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది.
ఈపీఎఫ్వో కింద కేంద్ర ప్రభుత్వం కనీసం నెలకు రూ.వెయ్యి పెన్షన్ అందిస్తోంది. అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఇదే పరిమితి కొనసాగుతోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు అన్నీ ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో కనీస పెన్షన్ పరిమితి పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి.

ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ పరిమితి పెంపుపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పెంచనుందనే ప్రచారం సాగుతోంది. 1995 నాటి ఉద్యోగుల పింఛను పథకం (EPS) కింద కనీస పెన్షన్ను పెంచాలని కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులతో సహా వివిధ వర్గాల నుండి ఎప్పటినుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. కార్మిక సంఘాలు ఆందోళనలు కూడా పలుమార్లు చేపట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఈ పథకం కింద కనీస పింఛను నెలకు రూ.వెయ్యిగా ఉంది. ఇప్పుడు వైద్య, నిత్యావసర సరుకుల ఖర్చులు పెరగడంతో రూ.వెయ్యి సరిపోవడం లేదు. దీంతో రూ.7,500కు పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ క్లారిటీ ఇదే..
దీనిపై తాజాగా లోక్సభలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈపీఎఫ్ఓ కనీస పింఛనును పెంచాలని కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు, వివిధ వర్గాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందినట్లు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. అయితే ఉద్యోగుల పింఛను పథకం అనేది సామాజిక భద్రతా పథకం. వేతనాలలో యజమాని వాటా 8.33 శాతంగా ఉంది. నెలకు రూ. 15 వేల వరకు జీతాలు పొందేవారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాటా 1.16 శాతంగా ఉంది. అయితే EPFO సభ్యులకు సామాజిక భద్రతా పరిధిని విస్తరించడానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే ఏవైనా మార్పులు చేసే ముందు పింఛను నిధి దీర్ఘకాలిక స్థిరత్వాన్ని, దాని భవిష్యత్ బాధ్యతలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఈపీఎస్కు తన వార్షిక వాటాకు అదనంగా కనీస పింఛను కోసం ఇప్పటికే బడ్జెట్ మద్దతును అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
పెన్షనర్ల నుంచి డిమాండ్లు ఇవే..
కనీస నెలసరి పింఛను రూ. 7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ద్రవ్యోల్బణానికి అనుసంధానం చేయాలని కోరుతున్నారు. పదవీ విరమణ పొందిన EPFO చందాదారులకు అధిక ఆర్థిక సహాయం అందించాలని,చాలా మంది ప్రస్తుతం నెలకు రూ. 1,000 నుండి రూ. 2,000 మధ్య మాత్రమే పింఛన్లు పొందుతున్నట్లు చెబుతున్నారు. అయితే కనీస పెన్షన్ను పెంచడంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఉద్యోగుల పెన్షన్ ఫండ్ ఆర్థిక పరిస్థితి, స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఏ పెంపునైనా పరిగణించాల్సి ఉంటుందని అది స్పష్టం చేసింది.
