Flight: పెరుగుతోన్న విమాన ప్రయాణికులు.. సెప్టెంబర్‌ ఒక్క నెలలోనే ఎంత మంది ప్రయాణించారో తెలుసా

|

Oct 18, 2024 | 2:15 PM

దేశంలో రోజురోజుకీ విమానంలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా దేశీయంగా నగరాల మధ్య విమాన సేవలు ఉపయోగించుకుంటున్న వారి సంఖ్యలో గణనీయంగా మార్పులు కనిపిస్తున్నాయి. తాజాగా గడిచిన సెప్టెంబర్ లో దేశంలో మొత్తం 1.30 కోట్ల మంది విమానాల్లో తమ గమ్యస్థానానికి చేరుకున్నట్లు గణంకాలు చెబుతున్నాయి..

Flight: పెరుగుతోన్న విమాన ప్రయాణికులు.. సెప్టెంబర్‌ ఒక్క నెలలోనే ఎంత మంది ప్రయాణించారో తెలుసా
Dgca
Follow us on

దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మంగళవారం అధికారులు ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు. దేశీయ విమానయాన సంస్థలు సెప్టెంబర్‌లో 1.30 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాయి. ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే 6.38 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

గతేడాది సెప్టెంబర్‌లో 1.22 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విడుదల చేసిన డేటా ప్రకారం.. ఇండిగో మార్కెట్ వాటా సెప్టెంబర్ 2024లో 63 శాతానికి పెరిగింది. అయితే ఎయిర్ ఇండియా వాటా 15.1 శాతానికి పెరిగింది. ఇక ఈ నెలలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌తో విలీనమైన AIX కనెక్ట్, ఆన్-టైమ్ పనితీరు పరంగా 70.1 శాతంతో అగ్రస్థానంలో ఉంది.

ఎవరి వాటా ఎంత.?

గత నెలలో విస్తారా మార్కెట్ వాటా 10 శాతానికి, AIX కనెక్ట్ మార్కెట్ వాటా 4.1 శాతానికి తగ్గిందని DGCA డేటా స్పష్టం చేస్తోంది. ఎయిర్ ఇండియా, AIX కనెక్ట్, విస్తారాతో సహా ఎయిర్ ఇండియా గ్రూప్ మొత్తం దేశీయ మార్కెట్ వాటా 29.2 శాతానికి చేరుకుంది. సెప్టెంబర్‌లో అకాసా ఎయిర్‌లో 5.73 లక్షలు, స్పైస్‌జెట్‌లో 2.61 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. అకాసా ఎయిర్ మార్కెట్ వాటా 4.4 శాతంగా ఉండగా, స్పైస్ జెట్ మార్కెట్ వాటా 2 శాతానికి పడిపోయింది. సంక్షోభంలో చిక్కుకున్న స్పైస్‌జెట్ జనవరితో పోలిస్తే సెప్టెంబర్‌లో మార్కెట్ వాటాలో 64 శాతం క్షీణతను చూసింది. దీంతో కేవలం 5.6 శాతం మంది ప్రయాణికులు మాత్రమే స్పైస్‌ జెట్‌లో ప్రయాణించారు.

ఆన్‌ టైమ్‌ పర్ఫార్మెన్స్‌ (ఓటీపీ) అంటే సమయానికి సేవలందించే జాబితాలో ఇండిగో 69.2 శాతంగా ఉండగా.. తర్వాతి స్థానాల్లో విస్తారా (69.1 శాతం), ఎయిర్ ఇండియా (68.1 శాతం) ఉన్నాయి. సెప్టెంబర్‌లో స్పైస్‌జెట్, అలయన్స్ ఎయిర్‌ల ఓటీపీలు వరుసగా 30.4 శాతం.. 53.8 శాతంగా ఉన్నాయి. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై మెట్రో విమానాశ్రయాలకు షెడ్యూల్ చేసిన డొమెస్టిక్‌ విమానయాన సంస్థలకు విమానాలు వచ్చిన సమయం ఆధారంగా ఈ ఓటీపీని లెక్కిస్తారు.

ఇక విమానాల రద్దు కారణంగా 48,222 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులకు పరిహారం, సౌకర్యాలు కల్పించేందుకు విమానయాన సంస్థలు రూ. 88.14 లక్షలు ఖర్చు చేశారు. ఇక డేటా ప్రకారం, గత నెలలో విమానాల ఆలస్యం 2,16,484 మంది ప్రయాణికులను ప్రభావితం చేసిందని వీరికి విమానయాన సంస్థలు రూ. 2.4 కోట్లు చెల్లించాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..