Indian Railways: కోచ్ లేదా మొత్తం రైలును బుక్ చేసుకోవచ్చు.. అదెలాగో తెలుసా..?

నార్మల్‌గా మనం ఎక్కడికైనా వెళ్లాలంటే ఎంతమంది ఉంటే అన్ని ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటాం. కానీ చాలా మంది కలిసి వెళ్లాలనుకుప్పుడు.. టికెట్స్ బుక్ చేస్తే అందరికీ సీట్లు ఒకే దగ్గర రాకపోవచ్చు. అయితే ఏకంగా బోగీ లేదా రైలునే బుక్ చేసుకోవచ్చని మీకు తెలుసా..? అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Indian Railways: కోచ్ లేదా మొత్తం రైలును బుక్ చేసుకోవచ్చు.. అదెలాగో తెలుసా..?
How to Book a Train Coach or Whole Train

Updated on: Aug 19, 2025 | 3:59 PM

పెళ్లిళ్లు, తీర్థయాత్రలు లేదా విహార యాత్రలు వంటి శుభకార్యాల కోసం బస్సులను అద్దెకు తీసుకోవడం సర్వసాధారణం. అయితే ఎక్కువ మంది ప్రయాణికులు, ఎక్కువ దూరం వెళ్లాల్సి ఉన్నప్పుడు, బస్సుల కంటే ట్రైన్ బెస్ట్ ఛాయిస్. టికెట్స్ బుక్ చేసుకుంటే సీట్లు ఎక్కడెక్కడ వస్తాయో అనే టెన్షన్ మీకు అవసరం లేదు. ఎందుకంటే మీకు అవసరమైతే బోగీ లేదా మొత్తం రైలునే బుక్ చేసుకోవచ్చు. ఈ విషయం చాలామందికి తెలియదు. రైల్వే ఈ సదుపాయాన్ని తక్కువ బడ్జెట్‌తో అందుబాటులో ఉంచింది.

బోగీకి రూ.50,000 డిపాజిట్

ఐఆర్‌సీటీసీ ఎఫ్‌టీఆర్ సేవ ద్వారా మీరు ఒకటి రెండు బోగీలను లేదా మొత్తం రైలును కూడా బుక్ చేసుకోవచ్చు. ఒక బోగీకి సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.50,000 చెల్లించాలి. మీరు రెండు బోగీలు బుక్ చేసుకుంటే రూ.లక్ష డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మొత్తం రైలును బుక్ చేసుకోవాలని అనుకుంటే.. కనిష్ఠంగా 18 నుంచి గరిష్ఠంగా 24 బోగీలను బుక్ చేసుకోవాలి. అయితే కనీసం 18 బోగీలకు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.9 లక్షలు చెల్లించాలి. మీకు 10 లేదా 12 బోగీలు అవసరం అయినప్పటికీ 18బోగీల సెక్యూరిటీ డిపాజిట్ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణ దూరం, ఎంపిక చేసుకున్న బోగీల సంఖ్య ఆధారంగా రైల్వే అధికారులు ప్రయాణ ఖర్చును నిర్ణయిస్తారు. ప్రయాణం పూర్తయిన తర్వాత చెల్లించిన మొత్తం నుండి ప్రయాణ ఖర్చును మినహాయించి మిగిలిన సెక్యూరిటీ డిపాజిట్‌ను పది రోజుల్లోపు తిరిగి ఇస్తారు.

రైలు లేదా బోగీని ఎలా బుక్ చేసుకోవాలి?

రైలు లేదా బోగీని బుక్ చేసుకోవడానికి గూగుల్‌లో FTR IRCTC అని వెతికితే అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.

  • మీరు రైలు బోగీ కావాలంటే కోచ్.. మొత్తం రైలు కావాలంటే ట్రైన్ అని సెలక్ట్ చేసుకోవాలి.
  • మీరు స్లీపర్, త్రీ-టైర్ ఏసీ, టూ-టైర్ ఏసీ, లేదా ఫస్ట్-క్లాస్ ఏసీ వంటి మీకు కావాల్సిన కోచ్ రకాన్ని ఎంచుకోవచ్చు.
  • మీరు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఎక్కడ ముగిస్తారనే వివరాలను నమోదు చేయాలి.
  • మీరు కనీసం 30 రోజుల ముందుగానే రైలు లేదా బోగీని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత ఒక వారంలోపు మీకు బుకింగ్ కన్‌ఫర్మేషన్ వస్తుంది. అది వచ్చిన తర్వాతే మీ బుకింగ్ కన్ఫర్మ్ అయినట్లు భావించాలి.

ఎవరికి ఉపయోగం?

ఈ సదుపాయం ఎక్కువ మంది ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాలకు బంధువులు కలిసి వెళ్లడానికి, కుటుంబ సభ్యులు, స్నేహితులతో విహార యాత్రలకు వెళ్లడానికి, పెద్ద బహిరంగ సభలకు వెళ్లే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ సాధారణంగా ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అత్యవసర పరిస్థితుల్లో రైల్వే బోర్డు అనుమతితో ఆఫ్‌లైన్ ద్వారా కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..