Dhanteras 2022: టన్నుల కొద్దీ బంగారాన్ని హాట్ కేకుల్లా కొనేశారు.. ధంతేరాస్ అంటే అట్లుంటది మరి..

|

Oct 26, 2022 | 1:18 PM

భారతదేశంలో ధంతేరాస్ పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 23న అమ్మకాలు జోరందుకున్నాయి. ఆ రోజున బంగారం కొంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందని, అదృష్టం వరిస్తుందని ఎన్నో ఎళ్లుగా భారతీయులు బలంగా..

Dhanteras 2022: టన్నుల కొద్దీ బంగారాన్ని హాట్ కేకుల్లా కొనేశారు.. ధంతేరాస్ అంటే అట్లుంటది మరి..
Diwali Dhanteras gold trading
Follow us on

భారతదేశంలో ధంతేరాస్ పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 23న అమ్మకాలు జోరందుకున్నాయి. ఆ రోజున బంగారం కొంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందని, అదృష్టం వరిస్తుందని ఎన్నో ఎళ్లుగా భారతీయులు బలంగా నమ్ముతున్నారు. ఆ విశ్వాసంతో దేశ వ్యాప్తంగా బంగారం నగల షాపులన్నీ ధంతేరాస్ రోజున కిటకిటలాడాయి. ధంతేరాస్ రోజు, అంతకన్నా ముందు రోజు కలిపి దేశమంతా నగల వ్యాపారులు ఎంత బంగారం అమ్మారనే విషయం రెండు రోజుల తర్వాత లెక్కలు బయటకు వచ్చాయి. కిల్లోల్లో కాదు, ఏకంగా టన్నుల్లో బంగారాన్ని కొనేశారు పసిడిప్రేమికులు. కేవలం రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో 39 టన్నుల బంగారాన్ని కొన్నారు. అంటే.. దాదాపు 39,000 కిలోల బంగారం అమ్ముడు పోయింది. ఈ మొత్తం విలువ రూ.19,500 కోట్లు ఉంటుందని ఇండియా బిలియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. గతేడాది ధంతేరాస్‌తో పోలిస్తే ఈసారి 30 శాతం ఎక్కువగానే బంగారాన్ని కొన్నారు పసిడిప్రేమికులు. పండుగ సీజన్ ముగియడంతో ఇక బంగారం అమ్మకాలు తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇండియా బిలియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం..

గతేడాది ధంతేరాస్ సందర్భంగా 30 టన్నులు అంటే 30,000 కిలోల బంగారం అమ్ముడుపోతే, ఈసారి 39 టన్నులు అంటే 39,000 కిలోల బంగారం వినియోగదారులు కొనుగోలు చేశారు. సెంటిమెంట్‌తో కొందరు, పెట్టుబడి కోసం మరికొందరు బంగారం కొనేందుకు ఆసక్తి చూపారు. హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.47,010, 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.51,290, కిలో వెండి ధర రూ.63,200 దగ్గర ట్రేడ్ అయింది. అంతకన్నా ముందు రోజుల్లో తక్కువగా ఉన్న బంగారం, వెండి ధరలు ధంతేరాస్ సమీపించే కొద్దీ కాస్త పెరిగాయి. అయినా గోల్డ్, సిల్వర్ కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపించారు. దీపావళి ముగియగానే గోల్డ్ రేట్ స్వల్పంగా తగ్గింది. కానీ బుధవారం బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి

అదే రోజున ఇండియా, పాకిస్తాన్ మధ్య టీ20 వాల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. దీంతో అమ్మకాలు ఎలా ఉంటాయోనని వ్యాపారులు ఆందోళన చెందారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కస్టమర్లు క్యూకట్టారని, షాపులు కిటకిటలాడాయని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ ఆశిష్ తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారితో రెండేళ్ల పాటు అన్ని రంగాల్లో అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఐతే ఈసారి దీపావళి ఫెస్టివల్ బిజినెస్ రూ.1.5 లక్షల కోట్లు దాటినట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేస్తున్నారు. బంగారు నగలు మాత్రమే కాదు, ఇతర వస్తువుల్ని పోటీపడి కొన్నారు.

ఇవి కూడా చదవండి
  • ఆటోమొబైల్ రంగంలో రూ.6,000 కోట్ల వ్యాపారం జరిగింది
  • రూ.1,500 కోట్ల ఫర్నీచర్, రూ.2,500 కోట్ల కంప్యూటర్లు, ఇతర పరికరాలు
  • రూ.3,000 కోట్ల ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, రూ.1,000 కోట్ల ఎలక్ట్రానిక్ వస్తువులు
  • రూ.500 కోట్ల స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం, ఇత్తడి పాత్రలు కొన్నారని CAIT వెల్లడించింది.

దీపావళి తర్వాత పెరుగుతున్న బంగారం ధరలు..

ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.170 పెరిగి ధర రూ.46,850 నుంచి రూ.47,000 వరకు చేరింది. ఇక 24 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.170 పెరిగి ధర రూ.51,110 నుంచి రూ.51,280 వరకు పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు పలుకుతున్నాయి. హైదరాబాద్‌లో వెండి ధరలు చూస్తే గతంలో సిల్వర్ రేట్ భారీగా తగ్గింది. ఐతే గత ఆరు రోజులుగా మళ్లీ పెరుగుతోంది. కిలో వెండిపై ఆరు రోజుల్లో రూ.3,000 పెరిగింది. వెండిపై రూ.500 పెరిగి రూ.64,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. దేశీయ మార్కెట్‌లోనే కాదు, మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో బంగారం ధరలు పెరిగాయి. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.03 శాతం అంటే రూ.15 పెరిగి రూ.50,648 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.06 శాతం అంటే రూ.36 పెరిగి రూ.58,091 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు పెరిగాయి..

ఔన్స్ బంగారం ధర 1,661.50 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 19.68 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ రేట్స్ గత వారం కన్నా ఎక్కువగానే ఉన్నాయి. వచ్చే ఏడాది ఇదే సమయానికి ఔన్సు బంగారం ధర 1,830.50 డాలర్లకు పెరగవచ్చని అంచనా