భారతదేశంలో డిజిటల్ పేమెంట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నగదు లేకుండా చేసే లావాదేవీలపై ప్రజల్లో నమ్మకం పెరగడంతో ప్రతి చోటా డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన యూపీఐ పేమెంట్లు భారతదేశంలో లావాదేవీల విప్లవం మొదలైంది. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉంటుందన్న చందాన డిజిటల్ పేమెంట్లు ద్వారా మోసగించే వారి సంఖ్య పెరుగుతుంది. ఇటీవల విడుదలైన చెక్ పాయింట్ సాఫ్ట్వేర్కు సంబంధించిన నివేదికలో సైబర్ దాడులు ఆందోళనకరమైన పెరుగుదలను నమోదు చేస్తున్నాయని పేర్కొంది. భారతీయ సంస్థలు గత ఆరు నెలల్లో ప్రతి వారం సగటున 3,291 దాడులను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ఇది ప్రపంచ సగటు వారానికి 1,847 దాడుల కంటే దాదాపు రెట్టింపు అని పేర్కొంది.
చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ నివేదికలో ఆరోగ్య సంరక్షణ రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొంది. 2024లో వారానికి 8600 పైగా దాడులు జరిగాయి. రెండవ అత్యంత దెబ్బతిన్న రంగం విద్య, ప్రభుత్వ రంగాలు ఉన్నాయని పేర్కొంది. 2025లో సైబర్ సెక్యూరిటీ అనేది నెట్వర్క్లను రక్షించడం మాత్రమే కాకుండా సిస్టమ్స్, సంస్థలపై నమ్మకాన్ని కాపాడుకోవడంలో కీలక చర్యలను తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా స్టేట్ ఆఫ్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ 2025 ప్రకారం ప్రజలను బెదిరించి మోసం చేసే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొంది. మే 2024లో అత్యంత దిగ్భ్రాంతికరమైన సంఘటన ఒకటి జరిగింది. ఒక భారీ ఉల్లంఘన 500 జీబీ సున్నితమైన బయోమెట్రిక్ డేటాను బహిర్గతం చేసింది. ఇందులో ప్రజల వేలిముద్రలు, వ్యక్తుల ముఖ స్కాన్లు ఉన్నాయి. పోలీసులు, పబ్లిక్ వర్కర్లకు సంబంధించిన ఈ డేటా ఎన్నికల సీజన్లో తప్పుడు చేతుల్లోకి వెళ్లింది.
భారతదేశానికి సంబంధించిన క్లిష్టమైన వ్యవస్థలు ఎంత పేలవంగా రక్షించబడతాయో? ఈ ఉల్లంఘన వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు డబ్బును దొంగిలించడంతో పాటు ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి నకిలీ వీడియోలు, తప్పుడు సమాచారాన్ని ఉపయోగిస్తున్నారు. పని కోసం ఉపయోగించే వ్యక్తిగత పరికరాలు సులభమైన లక్ష్యాలుగా మారుతున్నాయని, కాలం చెల్లిన వ్యవస్థలు పరిస్థితిని మరింత దిగజార్చాయని నివేదిక వెల్లడించింది. కాబట్టి దీన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు వేగంగా చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత సిస్టమ్స్ను భద్రపరచడం, అలాగే ఆ సిస్టమ్స్ను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం, రౌటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్ల వంటి బలహీనమైన ప్రదేశాలను బలోపేతం చేయాలని సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి