Auto Expo 2023: మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. రూ. 5పైసల ఖర్చుతో కిలోమీటర్ ప్రయాణం

కేవలం డెలివరీ బాయ్స్‌ కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఓ ఎలక్ట్రిక్‌ బైక్‌ ఆటో ఎక్స్‌పో 2023లో ప్రత్యేక ఆకర్షణ నిలుస్తోంది. కేవలం కిలోమీటర్‌ కు రూ. 5 పైసల ఖర్చుతోనే దానిని వినియోగించవచ్చని ఆ బైక్‌ తయారీ సంస్థ ప్రకటించింది. అసలు ఆ బైక్‌ ఏంటి? దాని సంగతేంటి చూద్దాం రండి..

Auto Expo 2023: మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. రూ. 5పైసల ఖర్చుతో కిలోమీటర్ ప్రయాణం
Ev Delivery

Edited By: Anil kumar poka

Updated on: Jan 20, 2023 | 7:42 PM

ఈ-కామర్స్‌ బాగా విస్తృతమైంది. ఎవరికి ఏదీ కావాలన్నా ఇంట్లోనే ఆన్‌లైన్‌ బుక్‌ చేసుకోవడం అలవాటైంది. ఆహారం దగ్గర నుంచి ఫోన్ల వంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్ల వంటి గృహోపకరణాలు వరకు ఇలా ఒకటేంటి అంతా ఆన్‌లైన్‌ ఆర్డర్లే. ఈ నేపథ్యంలో డెలివరీ ఉద్యోగాలకు డిమాండ్‌ పెరిగింది. కొంతమంది పార్ట్‌ టైం గా వీటిని నిర్వహిస్తుండగా.. మరికొంత మంది యువకులు డెలివరీ బాయ్స్‌గానే ఫుల్‌టైం పనిచేసే వారు ఉన్నారు. వీరు రోజూ పదుల సంఖ్యలో ఆర్డర్లు డెలివరీ చేయాల్సి ఉంటుంది. దూరాబారం ప్రయాణించాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో వస్తువులను తీసుకెళ్లడంతో పాటు బైక్‌ పెట్రోల్‌కి కూడా అధికంగా డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది. ఇది వారికి వచ్చే అరకొర జీతానికి అదనపు భారం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేవలం డెలివరీ బాయ్స్‌ కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఓ ఎలక్ట్రిక్‌ బైక్‌ ఆటో ఎక్స్‌పో 2023లో ప్రత్యేక ఆకర్షణ నిలుస్తోంది. కేవలం కిలోమీటర్‌ కు రూ. 5 పైసల ఖర్చుతోనే దానిని వినియోగించవచ్చని ఆ బైక్‌ తయారీ సంస్థ ప్రకటించింది. అసలు ఆ బైక్‌ ఏంటి? దాని సంగతేంటి చూద్దాం రండి..

ట్రాన్సిట్ పేరుతో..

నోయిడాకు చెందిన కోరిట్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ ట్రాన్సిట్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. వీధి వ్యాపారులతో పాటు డెలివరీ బాయ్స్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ కంపెనీ దీనిని తయారుచేసింది. దాదాపు 250 కిలోల బరువుతో ఇది ప్రయాణించగలుగుతుంది. ముఖ్యంగా దీని వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే వెనుక సీటు మార్పు చేసుకోవచ్చు. సీటును తొలగించి దాని స్థానంలో వ్యాపారులకు సంబంధించిన బ్యాగులు, డెలివరీ బాక్స్‌లను పెట్టుకునే వెసులుబాటు కల్పించారు.

స్పెసిఫికేషన్లు ఇవి..

ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌లో 2.8 kw సామర్థ్యం కలిగిన లిథియం అయాన్‌ బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి చార్జ్‌ చేస్తే 125 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. అలాగే పూర్తిగా చార్జ్‌ అవడానికి మూడున్నర గంటల సమయం పడుతుంది. ఈ బైక్‌ గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. దీని బ్యాటరీకి మూడేళ్ల వారంటీని కంపెనీ అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

50 నగరాల్లో..

ప్రస్తుతం మన దేశంలోని 50 నగరాల్లో ఈ బైక్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫిక్స్‌డ్‌ బ్యాటరీ ఉన్న స్థానంలో త్వరలో రిమూవబుల్‌ బ్యాటరీ ఆప్షన్‌ కూడా తీసుకురానున్నట్లు కంపెనీ ‍ప్రకటించింది.

రూ. 5 పైసలకే..

దీనిని చార్జ్‌ చేయడానికి అతి తక్కువ మొత్తం వినియోగదారుడు భరిస్తే సరిపోతుందని కోరిట్‌ కంపెనీ వ్యవస్థాపకుడు మయూర్‌ మిశ్రా చెప్పారు. దీని బ్యాటరీ ఫుల్‌ చార్జ్‌ అవడానికి దాదాపు మూడున్నర గంటల సమయంలో మూడు యూనిట్ల విద్యుత్‌ ని తీసుకుంటుందని తెలిపారు. ఇలా ఒక్కసారి చార్జ్‌ చేస్తే 125 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అలా చూసినప్పుడు యూనిట్‌ ధర రూ. 8 చొప్పున వేసుకుంటే.. వినియోగదారుడికి ప్రతి కిలోమీటర్‌కు కేవలం రూ 5 పైసలు మాత్రమే ఖర్చు అవుతుందని వివరించారు.

ధర ఎంతంటే..

కంపెనీ ఈ బైక్‌ ఆన్‌ రోడ్‌ ధరను రూ. 85,000 నుంచి ప్రారంభిస్తోంది. ఈఎంఐలో కొనుగోలు చేయాలనుకునే వారు 10 శాతం డౌన్‌ పేమెంట్‌ తో రూ. 4000 చొప్పున కట్టుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..