Central Government: దేశ ప్రజలకు కేంద్రం భారీ శుభవార్త.. వారి అకౌంట్లోకి రూ.5 లక్షలు..! అప్లై చేసుకోండి..
సామాన్యులకు కేంద్రం త్వరలో గుడ్ న్యూస్ తెలిపే అవకాశముందని తెలుస్తోంది. PMSBY, PMJJBY పథకాల బీమా మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతదం బీమా మొత్తం రూ.2 లక్షలుగా ఉంది. అయితే పెరుగతున్న ఖర్చుల కారణంగా ఇవి సరిపోవడం లేదు.

కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను సామాన్యుల కోసం అమలు చేస్తోంది. అందులో భాగంగా సామాన్యులకు అండగా నిలిచేందుకు తక్కువ ప్రీమియంతో బీమా పథకాలను నిర్వహిస్తోంది. జీవిత బీమా పథకంతో పాటు ప్రమాద బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పేరుతో జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోండగా.. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పేరుతో ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ప్రస్తుతం జీవిత బీమా రూ.2 లక్షలు, ప్రమాద బీమా రూ.2 లక్షలు అందిస్తుండగా.. ఈ రెండింటినీ రూ.5 లక్షలకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
రూ.5 లక్షలకు పెంపు..?
పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని బీమా మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకాలను 2015లో ప్రారంభించారు. ఇప్పటికి ప్రారంభించి 11 ఏళ్లు అవుతుంది. ఈ 11 ఏళ్లల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. దీంతో బీమాను కూడా త్వరలో పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రీమియం కూడా పెరగనుంది. ప్రీమియం, బీమా మొత్తాన్ని పెంచడంపై ఇన్యూరెన్స్ కంపెనీలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన
ఈ పథకంలో 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు చేరవచ్చు. ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. ఒక ఏడాది పాటు కాల పరిమితి ఉంటుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు అమల్లో ఉంటుంది. అనంతరం రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. రెన్యూవల్ చేసుకోకపోతే పథకం నుంచి తొలగిస్తారు. ప్రతీ ఏడాది మే 25 నుంచి 31వ తేదీ మధ్య బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా ప్రీమియం కట్ అవుతుంది. ఆ ప్రీమియం కట్ అయితే మీ పాలసీ రెన్యూవల్ అయినట్లు లెక్క. కొత్తగా చేరేవారికి జూన్ 1 నుంచి మే 31 వరకు కవరేజీ ఉంటుంది. ఒకవేళ పథకంలో చేరిన వ్యక్తి మరణిస్తే రూ.2 లక్షలను నామినీకి అందిస్తారు. ప్రస్తుతం ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లించాలి. సమీపంలోని బ్యాంక్ లేదా పోస్టాఫీస్కు వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు.
పీఎం సురక్షా బీమా యోజన
ఇక పీఎం సురక్షా బీమా యోజన పథకంలో చేరినవారు ఏడాదికి రూ.20 మాత్రమే ప్రీమియం చెల్లించాలి. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సులో ఎప్పుడైనా ఇందులో చేరవచ్చు. ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత వైకల్యానికి గురైనా రూ.2 లక్షలు అందిస్తారు. ఇక పాక్షికంగా వైకల్యానికి గురైతే రూ.లక్ష అందిసతారు. పాలసీ తీసుకున్న వ్యక్తికి 70 ఏళ్లు దాటితే పథకం రద్దు అవుతుంది. ఒక వ్యక్తి ఈ రెండు పథకాల్లోనూ చేరవచ్చు. రెండింటికి కలిపి ప్రీమియం రూ.456 ఉంటుంది.
