
వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్. త్వరలో మరో వందే భారత్ ట్రైన్ను రైల్వేశాఖ ప్రవేశపెట్టనుంది. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే.. ప్రకృతి సహజ సౌందర్యాలను ఆస్వాదిస్తూ పర్వతాలను చూసుకుంటూ ప్రయాణం చేయవచ్చు. పచ్చని పర్వతాలు, సొరంగాలు, వంతెనలు గుండా ఈ రైలు వెళ్లనుంది. ఈ రైల్వే వెళ్లేవారు ప్రకృతిని ఆస్వాదిస్తూ హాయిగా ప్రయాణం చేయవచ్చు. ఆగస్ట్ 11 నుంచి వందే భారత్ రైలు ట్రయల్ రన్ ప్రారంభం కానుండగా.. పరీక్షల అనంతరం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టనున్నారు. దేశంలోనే అత్యంత సుందరమైన రైలు మార్గంగా ఇది నిలవనుంది. ఎక్కడ? ఏంటి? అనే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బెంగళూరు-మంగళూరు మధ్య వందే భారత్ రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా సకలేష్ పూర్-సుబ్రహ్మణ్య రోడ్ ఘాట్ సెక్షన్లో ఆగస్ట్ 11 నుంచి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ మేరకు సౌత్ వెస్టర్న్ రైల్వే ఒక ప్రకటన జారీ చేసింది. పశ్చిమ కనుమల గుండా ఈ మార్గం వెళ్లనుండగా.. మొత్తం 55 కిలోమీటర్ల అత్యంత సవాల్తో కూడుకున్నదిగా చెప్పవచ్చు. ఎందుకు ఎత్తైన పర్వతాలు ఇక్కడ ఉంటాయి. అంతేకాకుండా ఈ మార్గంలో వంతెనలు, మలుపులు ఉన్నాయి. దీంతో వందే భారత్ ట్రైన్ నిటారు వాలులు, సొరంగాల గుండా సురక్షితంగా వెళ్లగలదా అనేది ఈ ట్రయల్ రన్లో పరీక్షించనున్నారు. ఈ ట్రయల్ రన్ కోసం రైల్వేశాఖ ఎనిమిది కోచ్లు కలిగిన వందే భారత్ సెట్ను అభివృద్ది చేసింది.
ఈ మార్గంలో ఉపయోగించే వందే భారత్ రైల్ సెట్ చాలా ప్రత్యేకమైనది. ఇందులో అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఆటో ఎమర్జెన్సీ బ్రేక్ వ్యవస్థను ఇందులో అమర్చారు. పల్లపు ప్రాంతాల్లో అనుమతించి వేగం కంటే రైలు ఎక్కువ స్పీడ్తో ప్రయాణిస్తే ఆటోమేటిక్గా బ్రేకులను వేస్తుంది. ఘాట్ ప్రాంతం గుండా వెళ్లేటప్పుడు స్పీడ్ను ఇది నియంత్రిస్తుంది. ట్రయల్ రన్స్లో భాగంగా బ్రేకింగ్ వ్యవస్ధ పనితీరుతో పాటు రౌండ్ సమయం, రైలు నిర్వహణ, సిబ్బంది కార్యకలాపాలను పరిశీలిస్తారు. సకలేష్పూర్–సుబ్రహ్మణ్య పశ్చిమ కనుమల గుండా ప్రయాణిస్తుంది. సుమారు 57 సొరంగాలు, 250కి పైగా వంతెనలు,108 పదునైన వంపులు వంటి ఉన్నాయి. దీంతో ఇది దేశంలోనే అత్యంత సవాలుతో కూడిన రైల్వే మార్గాల్లో ఒకటిగా నిలిచింది. వర్షాల సమయంలో కొండచరియలు విరిగిపడటం, రాళ్లు కూలడం వంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీంతో నిరంతరం అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.