
శ్రీకాకుళం: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విశాఖ రైల్వే జోన్లో ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయంపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పోరుబాట పట్టారు. వాల్తేర్ డివిజన్ సాధన దీక్ష పేరిట శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద ఈ దీక్ష మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్న దానికి భిన్నంగా తమ పార్టీ కార్యకలాపాల కోసం వింత ప్రకటనలు చేస్తున్న మోదీ.. రైల్వే జోన్ విషయంలో మరోసారి మోసం చేశారని మండిపడ్డారు. వాల్తేరు డివిజన్ను తీసేసి విశాఖ జోన్ ప్రకటించడం ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలను అపహాస్యం చేయడమేనన్నారు. దీన్ని ఖండించని ప్రతిపక్ష నేత జగన్ కూడా భాజపాకు వంతపాడుతున్నారని ఆక్షేపించారు. జిల్లాలోని అన్ని స్టేషన్లనూ విశాఖ రైల్వేజోన్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇచ్ఛాపురం, జాడుపూడి, సోంపేట, బారువా, సుమ్మాదేవి, మందస రోడ్, పలాస స్టేషన్లు ఒడిశాలోని ఖుర్దా రైల్వే డివిజన్ పరిధిలో కొనసాగుతున్నాయి. ఈ దీక్షలో రామ్మోహన్నాయుడుతో పాటు తెదేపా ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, కలమట వెంకటరమణ, శ్రీకాకుళం జడ్పీ ఛైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఈ దీక్ష మంగళవారం సాయంత్రం 6గంటల నుంచి బుధవారం ఉదయం 9గంటల వరకు కొనసాగనుంది. దీక్ష ప్రారంభానికి ముందు తెదేపా శ్రేణులు నిర్వహించిన భారీ ద్విచక్ర వాహన ర్యాలీలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.