అలార్మింగ్ దశలో హైదరాబాద్.. వణుకుపుట్టిస్తున్న కరోనా
హైదరాబాద్ నగరాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. హాట్ స్పాట్లలో పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అధికారుల వెన్నులో చలి పుట్టిస్తోంది. నియంత్రణా చర్యలు నగరంలో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో...
హైదరాబాద్ నగరాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. హాట్ స్పాట్లలో పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అధికారుల వెన్నులో చలి పుట్టిస్తోంది. నియంత్రణా చర్యలు నగరంలో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. మరిన్ని పకడ్బందీ చర్యలకు ఆదేశించారు. ముఖ్యమంత్రి సీరియస్ కావడంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు.
రాజధాని పరిధిలోని సైబరాబాద్లో 39 కంటైన్మెంట్ జోన్స్ గుర్తించారు. ఈ జోన్స్కు రాకపోకలను పూర్తిగా నిషేధించి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాలానగర్, మాదాపూర్, శంషాబాద్ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను గుర్తించారు. అల్వాల్, అస్మక్పేట్, జీడిమెట్ల అపూర్వకాలనీ, ధర్మారెడ్డికాలనీ, తుర్కపల్లి, కళావతినగర్, గచ్చిబౌలి, అయ్యప్ప సొసైటీ, ఇజ్జత్నగర్, హఫీజ్పేట్లో ఈ కంటైన్మెంట్ జోన్లున్నాయి.
వణుకు పుట్టిస్తున్న హాట్ స్పాట్స్ సంఖ్య
తెలంగాణలో మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో ఒక్క హైదరాబాద్ సిటీలోనే ఏకంగా 270 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ప్రతి సర్కిల్ లో ఒక్కో హాట్ స్పాట్ని గుర్తించిన అధికారులు.. ఒక్క పాజిటివ్ కేసు ఉన్న ప్రాంతాన్ని క్లస్టర్గా ఐడెంటిఫై చేసి పూర్తి స్థాయిలో దిగ్భంధం విధించారు. హైదరాబాద్ నగరంలో కంటైన్మెంట్ జోన్ల సంఖ్యను 15 నుండి 123కి పెంచారు. ఆ తర్వాత దాన్నిపుడు 126కి పెంచారు. ఒక్కో కంటైన్మెంట్ క్లస్టర్కు జోనల్ ఆఫీసర్, పోలీస్ అధికారి, నోడేల్ ఆఫీసర్లను ప్రబుత్వం కేటాయించింది.
ఒక్కో హాట్ స్పాట్ లో నలుగురు సభ్యులతో కూడిన అధికారుల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్గా తేలి.. డిశ్చార్జ్ చేసిన వారికి మరోసారి పరీక్షలు జరిపేందుకు శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 14న) అన్ని జోన్లలో కలిపి 190 మంది శాంపిల్స్ సేకరించనున్నాయి జీహెచ్ఎంసీ బృందాలు.