AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రంలో చైనాకు చెక్.. ‘స్మార్ట్‘ ప్రయోగం సక్సెస్

పక్కలో బల్లెంలా హిందూ మహాసముద్రంలో పాగా వేస్తున్న చైనా కుయుక్తులకు చెక్ పెట్టే దిశగా భారత్ మరో కీలకమైన ప్రయోగాన్ని జరిపింది. సముద్రంలో పాగా వేసే శత్రువుల సబ్‌మెరైన్లను...

సముద్రంలో చైనాకు చెక్.. ‘స్మార్ట్‘ ప్రయోగం సక్సెస్
Rajesh Sharma
|

Updated on: Oct 05, 2020 | 3:57 PM

Share

Check to China India test-fired SMART: పక్కలో బల్లెంలా హిందూ మహాసముద్రంలో పాగా వేస్తున్న చైనా కుయుక్తులకు చెక్ పెట్టే దిశగా భారత్ మరో కీలకమైన ప్రయోగాన్ని జరిపింది. సముద్రంలో పాగా వేసే శత్రువుల సబ్‌మెరైన్లను ఎదుర్కొనే యాంటీ సబ్‌మెరైన్ వ్యవస్థను రూపొందించే దిశగా ఇది కీలకమైన మలుపు అని రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ట్వీట్ చేశారు. సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో (స్మార్ట్) పేరిట ఈ ఆయుధ వ్యవస్థను డీఆర్డీఓ రూపొందించింది. దీనిని సోమవారం ఒడిశా తీరప్రాంతంలోని ఓ దీవి నుంచి విజయవంతంగా ప్రయోగించింది.

మనదేశానికి చుట్టూ వున్న చిన్నా చితకా దేశాలను మచ్చిక చేసుకునే కుయుక్తులతోపాటు హిందూ మహాసముద్రంపై పూర్తి పట్టు సాధించేందుకు చైనా చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే వుంది. ఇందులో భాగంగా సముద్ర అంతర్భాగంలో పెద్ద ఎత్తున సబ్‌మెరైన్లను మోహరిస్తూనే వుంది. అయితే ఈ సబ్‌మెరైన్లను గుర్తించి, తగిన విధంగా స్పందించే వ్యవస్థ మన దేశానికి ఇంత వరకు లేదు. ఈ దిశగా ప్రయోగాలు అనివార్యమన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు డీఆర్డీఓ యాంటి సబ్ మెరైన్ వ్యవస్థ రూపకల్పన దిశగా ప్రయోగాలు ప్రారంభించింది.

సబ్ మెరైన్ వార్ ఫేర్‌లో ఆధిపత్యం పొందే విధంగా కీలకమైన టార్పిడోను డీఆర్డీఓ రూపొందించింది. స్మార్ట్ పేరిట రూపొందించిన ఆయుధ వ్యవస్థను విజయవంతంగా ప్రయోగించింది. బాలిస్టిక్ మిసైల్, టార్పిడో కలిస్తే స్మార్ట్‌గా రూపాంతరం చెంది శత్రువుల సబ్ మెరైన్లను నిరోధిస్తాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సంకర జాతి ఆయుధంగా పిలుచుకునే ఈ టార్పిడో సముద్ర జలాల్లో 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 600 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుంది.

ఈ స్మార్ట్ క్షిపణిని యుద్ద నౌకల నుంచి గానీ, సముద్రం ఒడ్డున వుంచిన ట్రక్ నుంచి గానీ ప్రయోగించేలా రూపొందించారు. సబ్ మెరైన్ గుట్టు కనుగొనే దాకా ఇది గాల్లో ప్రయాణించి.. సబ్ మెరైన్ గుట్టు దొరకగానే సముద్ర అంతర్భాగంలోకి ఈ క్షిపణి నుంచి టార్పిడోను పంపిస్తుంది. చాలా దగ్గరికి వెళ్ళే వరకు సబ్ మెరైన్ ఈ టార్పిడోను గుర్తించలేదు.. గుర్తించే సరికే తప్పించుకునే అవకాశాలు చేజారతాయి.

ఈరకమైన ఆయుధ వ్యవస్థ అమెరికా, రష్యా, చైనా దేశాలకు మాత్రమే వుంది. అయితే చైనా దగ్గరున్న టార్పిడోల సామర్థ్యం తాజాగా భారత్ రూపొందించిన స్మార్ట్ టార్పిడోతో పోలిస్తే చాలా తక్కువ అని డీఆర్డీఓ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్మార్ట్ క్షిపణి కమ్ టార్పిడో ఓ గేమ్ ఛేంజర్ అని డీఆర్డీఓ ఛైర్మెన్ జి.సతీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also read: కోవాక్సిన్‌లో అదనపు ఔషధం..అదే కీలకం!

Also read: కాంగ్రెస్ గూటికి చెరుకు ఫ్యామిలీ..! దుబ్బాకే టార్గెట్