Telugu News Astrology Maha Shivratri 2025: Astrological Significance and Remedies Details in Telugu
Maha Shivratri 2025: మహా శివరాత్రితో కష్టాలకు శివ శివా! వారికి శని దోషం నుంచి విముక్తి
మహాశివరాత్రి జ్యోతిషశాస్త్రం ప్రకారం ఎంతో విశిష్టమైనది.శనీశ్వరుడికి అధిష్ఠాన దేవత పరమేశ్వరుడు అయినందువల్ల ఆ రోజున శివుడికి అభిషేకం చేసినా, అర్చన చేసినా, శివాష్టకాన్ని పఠించినా, కనీసం శివాలయంలో ప్రదక్షిణలు చేసినా శనీశ్వరుడి దుష్ప్రభావం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని రాశుల వారు మహా శివరాత్రి రోజున శివుడిని ఆర్చించడం వల్ల శని దోషం పూర్తిగా తొలగిపోతుంది.
Maha Shivratri 2025 Astrology: ఈ నెల(ఫిబ్రవరి 2025) 26న వచ్చే మహాశివరాత్రి జ్యోతిషశాస్త్రం ప్రకారం ఎంతో విశిష్టమైనది. ఉచ్ఛ శుక్రుడు, మీన రాశిలో బుధుడు, వృషభరాశిలో పరివర్తన చెందిన గురువు, కుంభ రాశిలో రవి, శనులు ఆ రోజు నుంచి సంచారం చేస్తున్నందువల్ల అధిక భాగం గ్రహాలు శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం కలిగింది. శనీశ్వరుడికి అధిష్ఠాన దేవత పరమేశ్వరుడు అయినందువల్ల ఆ రోజున శివుడికి అభిషేకం చేసినా, అర్చన చేసినా, శివాష్టకాన్ని పఠించినా, కనీసం శివాలయంలో ప్రదక్షిణలు చేసినా శనీశ్వరుడి దుష్ప్రభావం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. శివుడికి ప్రార్థన చేసినవారికి ఫిబ్రవరి 26 నుంచి మార్చి 29 వరకూ శుభ ఫలితాలే ఎక్కువగా అనుభవానికి వస్తాయి. కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశుల వారు ఆ రోజున శివుడిని ఏదో విధంగా అర్చించడం వల్ల శని దోషం పూర్తిగా తొలగిపోతుంది.
కర్కాటకం: ఈ రాశివారిని గత రెండున్నరేళ్లుగా అష్టమ శని పీడించడం జరుగుతుంది. మార్చి 29తో వీరికి ఆ అష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. అయితే, మహా శివరాత్రి రోజున ఈ రాశివారు రుద్రా ష్టకం చదివినా, శివుడికి అర్చన చేసినా అష్టమ శని దోషం ఆ రోజు నుంచి పూర్తిగా తొలగి పోతుంది. ఏ పని చేపట్టినా ఆటంకాలు, అవరోధాలు, ఆలస్యాలు లేకుండా పూర్తవుతుంది. ఆగి పోయిన ఆర్థిక పురోగతి ఒక్కసారిగా ఊపందుకుంటుంది. ఉద్యోగంలోకష్టనష్టాలు తొలగిపోతాయి.
సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న శని వల్ల పెళ్లిళ్లు ఆగిపోవడం, వృత్తి, వ్యాపారాల్లో కలిసి రాక పోవడం ఎక్కువగా జరుగుతుంటుంది. ప్రతి ప్రయత్నమూ ఆలస్యంగా పూర్తవుతుంటుంది. అయితే, శివరాత్రి నాడు బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం వల్ల విశేషమైన ధన లాభం కలగడం, ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, ఆశించిన పెళ్లి సంబంధం కుదరడం, కీర్తి ప్రతిష్ఠలు కలగడం వంటివి జరుగుతాయి. కొన్ని అనారోగ్యాల నుంచి బయటపడడం కూడా జరుగుతుంది.
వృశ్చికం: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో ఉన్న శని గత రెండున్నర ఏళ్లుగా మనశ్శాంతి లేకుండా చేయ డం జరుగుతోంది. కుటుంబంలో సుఖ సంతోషాలు లేకపోవడం, నిరాశా నిస్పృహలు ఆవరించడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. శివరాత్రి నాడు శివుడికి చిన్నపాటి అర్చన చేయించినా విశేషమైన శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.
మకరం: ఈ రాశివారు గత ఏడున్నరేళ్లుగా అనుభవిస్తున్న ఏలిన్నాటి కష్టాలు ఫిబ్రవరితో తీరిపోవాలన్న పక్షంలో శివరాత్రి నాడు ఉపవాసం ఉండడం లేదా జాగరణ చేయడం వంటివి చేయడం చాలా మంచిది. రావలసిన డబ్బు రాకపోవడం, మొండి బాకీలు పెరగడం, తక్కువ వేతనానికి ఎక్కువ పని చేయడం, వేతనాలు ఎగ్గొట్టడం వంటి సమస్యల నుంచి త్వరితగతిన బయటపడడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
కుంభం: ఈ రాశివారికి ఏలిన్నాటి ప్రారంభమైన తర్వాత ఈ అయిదేళ్ల కాలంలో ఉద్యోగంలోనే కాక, కుటుంబంలో కూడా బరువు బాధ్యతలు పెరగడం, విశ్రాంతి కరువవడం, అనారోగ్యాలతో ఇబ్బందులుపడడం, సరైన గుర్తింపు లభించకపోవడం, పదోన్నతులు ఆగిపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. శివరాత్రి నాడు శివార్చన చేయించడం వల్ల తప్పకుండా శని ప్రభావం చాలా వరకు తగ్గిపోయి, అనేక విషయాల్లో ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.
మీనం: ఈ రాశివారు ఏలిన్నాటి శని దోషం వల్ల గత రెండున్నరేళ్లుగా ఆదాయానికి మించిన ఖర్చులతో అవస్థలు పడడం జరిగే అవకాశం ఉంది. పనికి తగ్గ వేతనం లభించకపోవడం, ఆశించిన గుర్తింపునకు నోచుకోకపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. శివరాత్రి రోజున బిల్వ పత్రాలతో రుద్రాష్టకం చేయించడం వల్ల వీరికి ఏలిన్నాటి శని దోషం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా, ఆదాయపరంగా ఆశించిన వృద్ది తప్పకుండా ఉంటుంది.