
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 2019లో 151 సీట్లలో గెలుపొందిన ఆ పార్టీ.. ఐదేళ్లు తిరిగేసరికి 11 సీట్లకు పడిపోయింది. దీంతో ఓటమి వెనుక కారణాలను విశ్లేషించుకుంటోంది. ఇందులోభాగంగా తాడేపల్లిలోని కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతో పాటు కీలక నేతలతో జగన్ భేటీ అయ్యారు. వేర్వేరు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. మేనిఫెస్టోలో 99శాతం హామీలు అమలు చేసినా.. వచ్చిన ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని జగన్ పేర్కొన్నారు. 2.7 లక్షల కోట్ల మందికి డీబీటీ ద్వారా లబ్ది చేకూర్చామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అందించడంలో ఏ వర్గాన్ని కూడా పక్కనపెట్టలేదన్నారు. అంతమంది ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియలేదన్నారు జగన్. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ వైసీపీకి 40శాతం ఓట్లు పడ్డాయన్న విషయాన్ని నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈవీఎంల గురించి మాట్లాడుతూ.. ఆధారాలు లేకుండా మాట్లాడలేమంటూ జగన్ పేర్కొన్నారు. వయసుతో పాటు పోరాడే సత్తా తనకుందన్నారు.
చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను త్వరలోనే ప్రజలు గుర్తిస్తారన్నారు. 2029లో తిరిగి వైసీపీని ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని.. వాళ్లకు భరోసానివ్వాల్సిన బాధ్యత నాయకులదేనంటూ జగన్ గుర్తుచేశారు. ఓడిపోయామన్న బాధ మనసులోంచి తీసేయండి.. ప్రతీ కార్యకర్తకు అండగా ఉండండంటూ సూచించారు.
అసెంబ్లీ సమావేశాలపైనా స్పందించారు జగన్. సంఖ్యాబలం తక్కువ కారణంగా సభకు వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండబోదన్నారు. అంతకంటే ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు చేయడం బెటర్ అనే సంకేతాలిచ్చారు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చి.. ఆ తర్వాత హామీల అమలుపై నిలదీసే కార్యక్రమాలుంటాయని క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..