Srikakulam District: ఏం మహానటివి అమ్మా… భర్తను లేపేసి భలే నాటకం

గతంలో వరకట్న వేధింపులనో,లేదా ఇంకే ఇతర కారణాల వల్లో భర్త చేతిలో భార్యలు మృతి చెందిన ఘటనలు చాలా జరిగేవి. అయితే ఇటీవల కాలంలో సీన్ రివర్స్ అవుతోంది. వివాహేతర సంబంధం మోజులో పడి భర్తలను హతమారుస్తోన్న భార్యల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. ఈ జిల్లా... ఆ జిల్లా... అన్న తేడా లేకుండా ఏదో ఒక చోట ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు వింటూనే ఉన్నాం. మూడుముళ్ల బంధాన్ని కాదని మూడవ వ్యక్తి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతెరిస్తున్నారు కొందరు వివాహితలు. పక్క స్కెచ్ వేస్తూ ప్రియుడితో కలిసి భర్తను ఖతం చేసేస్తున్నారు. అయితే చివరకు ఏదో ఒక ఆధారం ద్వారా పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు. 

Srikakulam District: ఏం మహానటివి అమ్మా... భర్తను లేపేసి భలే నాటకం
Chandraiah - Eeswaramma - Chintada Bala Muralikrishna

Edited By:

Updated on: Feb 03, 2025 | 9:20 AM

సంచలనం రేపిన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం బొబ్బిలిపేటలో కిందటి నెల 25న జరిగిన వైసిపి నాయకుడు చంద్రయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు దర్యాప్తులో పోలిసులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.ఈ హత్య కేసులో భార్య ఈశ్వరమ్మతో పాటు మొత్తం పది మందిని నిందితులుగా గుర్తించారు. అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఒకరు 15 ఏళ్ల మైనర్ కూడా ఉన్నాడు. ఈ కేసులోభార్య వివాహేతర సంబంధమే భర్తకు శాపంగా మారి చివరకు అతని ప్రాణాల్ని బలితీసిందని తేల్చారు పోలిసులు.

మృతుడు గురుగుబిల్లి చంద్రయ్య భార్య ఈశ్వరమ్మ(32)తో అదే గ్రామానికి చెందిన చింతాడ బాలమురళి కృష్ణ(35)అనే యువకుడుకి వివాహేతర సంబంధం ఉంది. వారి వివాహేతర సంబందం భర్త చంద్రయ్యకు తెలిసి పలుమార్లు భార్యను నిలదీసాడు చంద్రయ్య. ఈశ్వరమ్మకు, బాలమురళీకృష్ణకు మధ్య ఎటువంటి సమాచారం ఉండకూడదని తలచి ఆమె ఫోన్ కూడా తీసుకున్నాడు చంద్రయ్య. అయితే తర్వాత గుట్టుగా వేరే ఒక ఫోనును బాలమురళీ… ఈశ్వరమ్మకి ఇచ్చాడు. దీంతో ఇద్దరు రహస్యంగా ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలోనే వారు శారీరకంగా కలవడానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి అతడ్ని అంతం చేయాలని తలచారు. దీని కోసం వరుసకు తమ్ముడు అయిన ఆమదాలవలస మండలం శ్రీనివాసచార్యులపేటకి చెందిన అరవింద్‌ను సంప్రదించాడు బాలమురళీ కృష్ణ. అరవింద్ గతంలో ఒక డాబాను నిర్వహించేవాడు. అప్పట్లో దాబాలో పనిచేసే బూర్జ మండలం ఉప్పినివలసకి చెందిన గొల్లపల్లి వంశీ, సవలపురం గణేశ్, ప్రవీణ్, బొమ్మాళీ శ్రీ వర్ధన్, ఉమా మహేశ్, ఆమదాలవలస మండలం ఈశర్లపేటకి చెందిన కృష్ణ అనే యువకుల ద్వారా చంద్రయ్యను మర్డర్ చేసేందుకు పూనుకున్నాడు.

ఈ గ్యాంగ్ ఆమదలవలసలోని స్థానిక డాబాలో బీర్లను సేవించి మూడు రోజులు రెక్కీ చేసి నాలుగవ రోజు బైక్ పై వస్తున్న చంద్రయ్యను దారి కాసి బీరు సీసాలు, కర్రలతో విచక్షణ రహితంగా చనిపోయినంత వరకు చంద్రయ్యను కొట్టారు నిందితులు. ఆపై చంద్రయ్య మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ఆయనను చెరువు వరకు ఈడ్చుడు వెళ్లి అక్కడ పడేసారు. చంద్రయ్యను హత్య చేసిన తర్వాత అతని భార్య ఈశ్వరమ్మతో ఫోన్లో మాట్లాడి నీ భర్తని హత్య చేసేసాము ఇక మనకు ఎవరు అడ్డు లేరని ఆమెతో బాలమురళీ కృష్ణ చెప్పాడు.

చంద్రయ్య స్థానిక వైసిపి నేత. అయితే గతంలో ఇదే గ్రామంలో రాజకీయ కక్షలతో ఇద్దరి హత్య గావించబడ్డారు. ఈ నేపథ్యంలో మొదట చంద్రయ్యది కూడా రాజకీయ హత్యే అయి ఉంటాదని అంతా భావించారు. అయితే కొందరు స్థానికులు హత్యకు ముందు ఆ మార్గంలో బైక్‌లతో కొందరు వ్యక్తులు చాలా సేపు ఉన్నారని , మద్యం కూడా సేవిరించారని చెప్పడంతో పోలీసులు దానిపై దర్యాప్తు చేపట్టుగా నిందితులు దొరికిపోయారు.

నిందితులు హత్యకు ఉపయోగించిన ఒక కారు,  మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులను స్థానిక ఆముదాలవలస కోర్టులో హాజరు పరిచారు. హత్యలో పాల్గొన్న వ్యక్తులందరూ సమీప గ్రామ యువకులే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..