Vizianagaram: కస్టమర్ డాక్యూమెంట్స్ పోగొట్టిన SBI.. వినియోగదారుల ఫోరం కీలక తీర్పు..
విజయనగరంలో బ్యాంకు నిర్లక్ష్యంపై జిల్లా వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. కార్ లోన్ సెక్యూరిటీగా బ్యాంకులో డిపాజిట్ చేసిన ఖాళీ భూమి ఒరిజనల్ డాక్యుమెంట్లు పోయిన ఘటనలో ఎస్బీఐ కంటోన్మెంట్ బ్రాంచ్పై కమిషన్ జరిమానా విధించింది. ఆ డీటేల్స్ కథనంలో ..

విజయనగరంలో వినియోగదారుల హక్కులకు సంబంధించిన ఒక కీలక తీర్పు వెలువడింది. బ్యాంకు నిర్లక్ష్యం ఎంతటి నష్టాన్ని కలిగించగలదో చూపించే ఈ కేసులో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కంటోన్మెంట్ బ్రాంచ్కు జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. తన అసలు డాక్యుమెంట్లు కోల్పోయిన వినియోగదారుడికి రూ.3 లక్షల పరిహారం, రూ.20 వేల న్యాయ ఖర్చులతో కలిపి మొత్తం రూ.3.20 లక్షలు చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉడా కాలనీలో నివసించే ఒక వ్యక్తి 2000 సంవత్సరంలో కార్ లోన్ కోసం ఎస్బీఐలో అప్లై చేసుకున్నారు. లోన్ సెక్యూరిటీగా తన ఖాళీ భూమికి సంబంధించిన ఒరిజనల్ డాక్యుమెంట్ను బ్యాంకులో డిపాజిట్ చేశారు. 2013లో లోన్ను పూర్తిగా చెల్లించి పత్రాలు తిరిగి ఇవ్వమని కోరగా, బ్యాంకు సిబ్బంది కాలయాపన చేస్తూ వచ్చారు. పలుమార్లు అడిగిన తర్వాత డాక్యుమెంట్స్ పోయాయని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాధితుడు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. విచారణలో బ్యాంకు నిర్లక్ష్యం స్పష్టమవ్వడంతో వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు ఆర్.వి. నాగసుందర్ కీలక తీర్పు వెల్లడించారు. ఒరిజనల్ డాక్యుమెంట్ పోయిన ఘటన పై వెంటనే పోలీసు ఫిర్యాదు చేయాలని, బాధితుడికి సర్టిఫైడ్ డూప్లికేట్ పత్రాలు, ఇండెమ్నిటీ బాండ్ అందించాలని ఆదేశించారు. అదనంగా 45 రోజుల్లో నిర్దేశించిన పరిహారం చెల్లించాలని హెచ్చరించారు. పత్రాలను భద్రపరచడంలో బ్యాంకుల బాధ్యత ఎంత కీలకమో గుర్తు చేసే తీర్పుగా ఇది నిలిచింది. వినియోగదారులకు ఎక్కడైనా నష్టం జరిగితే సరైన పత్రాలతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చని సూచించారు వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు ఆర్.వి. నాగసుందర్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
