హైదరాబాద్లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. 184 కోట్ల వ్యయంతో నిర్మించిన 754.38 మీటర్ల పొడవైన కేబుల్ బ్రిడ్జి త్వరలోనే నగరవాసులకు అందుబాటులోకి రానుంది. ఈ బ్రిడ్జి నిర్మానంతో మాదాపూర్ – జూబ్లీహిల్స్ల మధ్య దూరం గణనీయంగా తగ్గనుంది. కేబుల్ బ్రిడ్జితో దుర్గం చెరువు పర్యాటక ప్రాంతంగానూ మారనుంది. ఈ సందర్భంగా బిడ్జి నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీర్ల బృందాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. మౌలిక సదుపాయాల కల్పన వృద్ధి చాలా కీలకమని.. దానికోసం తెలంగాణ ప్రభుత్వం 60 శాతం బడ్జెట్ను ఖర్చు చేస్తోందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇకపోతే, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి అందాలు అందరిని కనువిందు చేస్తున్నాయి. రాత్రి సమయంలో విద్యుత్ వెలుగుల మధ్య ఈ కేబుల్ బ్రిడ్జి జిగేల్ మంటోంది. ఆ బ్రిడ్జిని చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు. దీనికి సంబంధించిన వీడియోను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నగర ప్రజలను మరింతగా ఆకర్షిస్తోంది. రంగురంగుల విద్యుత్ వెలుగుల మధ్య మెరిసిపోతున్న బ్రిడ్జిని డ్రోన్ల సాయంతో వీడియో తీశారు.