కరోనా ఎఫెక్ట్: నంద్యాలలో పది రోజుల లాక్డౌన్
దేశవ్యాప్తంగా అన్లాక్డౌన్ ప్రక్రియ ఎప్పటి నుంచో మొదలైంది. అయితే లాక్డౌన్ సడలింపుల తరువాత కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా అన్లాక్డౌన్ ప్రక్రియ ఎప్పటి నుంచో మొదలైంది. అయితే లాక్డౌన్ సడలింపుల తరువాత కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అధికారులు మళ్లీ లాక్డౌన్ పెడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్ని విధించుకుంటున్నారు. తాజాగా నంద్యాలలో 10 రోజుల పాటు లాక్డౌన్ విధించారు అధికారులు. ఈ మేరకు వారు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
బుధవారం నుంచి ఈ నెల 25 వరకు నంద్యాలలో అత్యవసర సర్వీసులకు మాత్రమే సడలింపు ఇచ్చారు. ఇక నిత్యావసర సరుకులు, రిటైల్ కూరగాయల అమ్మకాలకు ఉదయం 6గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే అనుమతిని ఇవ్వనున్నారు. ఆ తరువాత లాక్డౌన్ అమలులో ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ మాట్లాడుతూ.. బయటకు వచ్చే వారు ప్రతి వ్యక్తి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు.