
సోషల్ మీడియా అకౌంట్లో ఫోటోలు, వీడియోలు పెట్టడం ఎంతవరకు సేఫ్.. అనే విషయంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది.. ఏది ఏమైనా.. ఇది మాత్రం అస్సలు మంచిది కాదంటూ పోలీసులు, సైబర్ ఎక్స్ పర్ట్స్ అవగాహన కల్పిస్తున్నా.. జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మన ప్రైవసీ ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దీంతో అక్కడ నుంచి బెదిరింపులు… బ్లాక్ మెయిలింగ్లు.. ముఖ్యంగా మహిళలు, యువతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా విశాఖకు చెందిన ఓ మహిళకు అటువంటి అనుభవమే ఎదురయింది. విశాఖకు చెందిన ఓ మహిళ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్టోరీ స్టేటస్ పెట్టుకుంది. అప్పుడప్పుడు ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉండేది. అయితే ఓ రోజు.. ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసేసరికి గుండె పగిలే పని అయింది. ఎందుకంటే అందులో ఉన్నది తన ఫోటో.. అది కూడా చూడని విధంగా అశ్లీలంగా ఉంది..
దీంతో షాక్లోకి వెళ్లిపోయిన ఆ మహిళకు.. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో మరో మెసేజ్ వచ్చింది.. చెప్పినట్టు వినకపోతే ఇలాంటి ఫోటోలు అందరికీ షేర్ చేస్తానని బెదిరింపు. తనకు ఫోటో వచ్చిన అకౌంటు ఎవరిదో అని వెరిఫై చేస్తే అంతుపట్టలేదు. అది ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్.. ఫేక్ అకౌంట్ ను క్రియేట్ చేసి బాధితురాలి ఫొటోస్ మార్ఫ్ చేసి బెదిరిస్తున్నట్టు తెలుసుకొని షాక్లోకి వెళ్ళిపోయింది బాధితురాలు..
చివరకు ధైర్యం చేసి సైబర్ క్రైమ్ పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. విషయాన్ని పోలీసుల ముందు చెప్పి ఆవేదన చెందింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు.. సాంకేతిక సహాయంతో బాధితురాలి సాధారణ ఫొటోలను ఆమె ఇంస్టాగ్రామ్ ఎకౌంటు స్టోరీస్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో అప్లికేషన్ను ఉపయోగించి సాధారణ ఫోటోలను అశ్లీలంగా మార్ఫ్ చేసినట్టు గుర్తించారు. బాధితురాలు ఇంస్టాగ్రామ్ కి పంపించింది నంద్యాల జిల్లాకు చెందిన గురునాథ్ గా పోలీసులు గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేసారు.
అపరిచిత వ్యక్తుల పట్ల సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో.. టెలిగ్రామ్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ నందు రిక్వెస్ట్ వచ్చిన యాక్సెప్ట్ చేయకుండా ఉండాలని.. అలానే మన సోషల్ మీడియా ఎకౌంటులను ప్రైవేటు లో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో సాన్నిహిత్యం పనికి రాదని, తెలియని లింక్ పై క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in, లేదా టోల్ ఫ్రీ నెంబర్: 1930 లేదా కమిషనర్ ఆఫ్ పోలీస్ 7995095799 వారికి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..