
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా యాప్లు మైనర్ల జీవితాలపై ఎంతటి ప్రభావం చూపుతున్నాయో చెప్పడానికి విజయవాడ ప్రసాదంపాడులో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ మైనర్ బాలుడి కోసం, కన్నవారిని కాదని ఓ 16 ఏళ్ల బాలిక అర్థరాత్రి వేళ ఇల్లు దాటి వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన పదో తరగతి చదివిన ఓ బాలికకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పామర్రు నియోజకవర్గం కూచిపూడికి చెందిన ఓ మైనర్ బాలుడితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ నిరంతరం చాటింగ్ చేసుకుంటుండటాన్ని గమనించిన తల్లి, కూతురిని మందలించింది. ఈ క్రమంలో ఈ నెల 21న బాలిక అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి వెళ్తున్నానని అమ్మమ్మకి చెప్పి రాత్రి ఎవరికీ తల్లికి తెలియకుండా బస్సు ఎక్కి నేరుగా కూచిపూడిలోని ఆ బాలుడి ఇంటికి చేరుకుంది.
మరుసటి రోజు బాలిక ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పటమట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సదరు బాలుడి ఇన్స్టా ఐడీ ఆధారంగా వారి లోకేషన్ను కూచిపూడిలో ఉన్నట్లు గుర్తించారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. బాలిక తమ ఇంటికి రావడం చూసి బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆమెను ఇంటికి వెళ్లమని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, బాలిక నిరాకరించడమే కాకుండా వెనక్కి పంపితే చనిపోతాను అని బెదిరించింది. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకుండా, అతి కష్టం మీద ఆమెను ఒప్పించి విజయవాడకు తీసుకువస్తుండగా.. మార్గమధ్యలో పోలీసులు కలిశారు. దీంతో వారిని స్టేషన్కు తరలించారు. పోలీసు స్టేషన్లో బాలికకు, ఆమె తల్లికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..