Andhra Pradesh: ప్రభుత్వ అధికారికి షాక్ ఇచ్చిన కేటుగాళ్ళు.. ఏకంగా సీబీఐ పేరుతో కుచ్చుటోపీ

| Edited By: Jyothi Gadda

Dec 06, 2023 | 11:03 AM

మత్స శాఖలో జాయింట్‌ డైరెక్టర్‌నని.. తన 60 ఏళ్ల వయసులో ఇప్పటివరకు ముంబై వైపు వెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలా సిమ్‌కార్డు కొంటానంటూ ప్రశ్నించారు. ఎస్సై సందీప్‌రావు అని చెప్పిన వ్యక్తి ఇదేమీ పట్టించుకోలేదు.. ఒకసారి సీబీఐ అధికారి మాట్లాడతారంటూ మరో వ్యక్తిని ఆకాష్ కులహరిగా పరిచయం చేశాడు. తాను సీబీఐ అధికారినంటూ ఫోన్‌లో స్కైప్‌ యాప్‌ ద్వారా పోలీస్‌ యూనిఫాంతో ప్రత్యక్షమయ్యాడు.

Andhra Pradesh: ప్రభుత్వ అధికారికి షాక్ ఇచ్చిన కేటుగాళ్ళు.. ఏకంగా సీబీఐ పేరుతో కుచ్చుటోపీ
Unknown Person Phone Call
Follow us on

ఓ ప్రభుత్వ అధికారికి తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది..ఆయన వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు… అవతలి వైపు నుంచి మాట్లాడిన వ్యక్తి చెప్పిన మాటతో షాకయ్యారు… ఆ తర్వాత అసలు డ్రామా మొదలు పెట్టారు. ఏకంగా సీబీఐ పేరుతో అధికారిని నమ్మించారు.. బెదిరింపులకు దిగారు. అక్కడితో ఆగకుండా అకౌంట్‌లో డబ్బులు కూడా జమ చేయించుకున్నారు. ఆ తర్వాత అసలు ట్విస్ట్ బయటపదింది..

ఏపీ మత్స్యశాఖ జేడీని బురిడీ కొట్టించారు కేటుగాళ్లు. ఇప్పుడు ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది.. సీబీఐ పేరుతో బెదిరించి డబ్బుల్ని వసూలు చేశారు. ఆ తర్వాత మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ సమీపంలోని పోరంకిలో ఉంటున్న వి.వెంకటేశ్వరరావు రాష్ట్ర మత్స్య శాఖలో జాయింట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. గత నెల 27న పెనమలూరు కూడలిలోని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్‌ కార్యాలయానికి వెళుతుండగా.. ఆయన మొబైల్‌కు ట్రాయ్‌ పేరుతో ఓ ఫోన్‌ వచ్చింది. ఆయన కాల్ ఎత్తగా.. అవతలి వైపు నుంచి ఓ వ్యక్తి ఓ విషయాన్ని చెప్పాడు

వెంకటేశ్వరరావు పేరు, ఆధార్‌ నంబరుతో కొంత కాలం క్రితం ముంబైలో ఓ సిమ్‌ కార్డు కొన్నట్లు, దాని నుంచి మహిళలకు అసభ్యకర సందేశాలు, ఫోన్లు వెళుతున్నట్ ఫిర్యాదు వచ్చిందని చెప్పాడు. కేసు కూడా నమోదు చేశారని చెప్పడంతో అవాక్కయ్యారు. వెంకటేశ్వరావు తేరుకునేలోపు అవతలి వ్యక్తి కేసు నమోదు చేసిన ముంబైలోని నౌపడా పోలీస్‌ స్టేషన్‌ ఎస్సైతో మాట్లాడాలంటూ కాన్ఫరెన్స్‌ కలిపాడు. మరో వ్యక్తి తన పేరు సందీప్‌రావు అని.. తాను నౌపడా స్టేషన్‌ ఎస్సై అంటూ పరిచయం చేసుకున్నాడు.. కేసు నమోదైనట్లు చెప్పాడు.

ఇవి కూడా చదవండి

దాదాపు 17 మంది మహిళల నుంచి ఫిర్యాదులు వచ్చాయంటూ వెంకటేశ్వరరావును అతడు భయపెట్టాడు. ఆయన ఆందోళనతో.. తాను ఏపీ మత్స శాఖలో జాయింట్‌ డైరెక్టర్‌నని.. తన 60 ఏళ్ల వయసులో ఇప్పటివరకు ముంబై వైపు వెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలా సిమ్‌కార్డు కొంటానంటూ ప్రశ్నించారు. ఎస్సై సందీప్‌రావు అని చెప్పిన వ్యక్తి ఇదేమీ పట్టించుకోలేదు.. ఒకసారి సీబీఐ అధికారి మాట్లాడతారంటూ మరో వ్యక్తిని ఆకాష్ కులహరిగా పరిచయం చేశాడు. తాను సీబీఐ అధికారినంటూ ఫోన్‌లో స్కైప్‌ యాప్‌ ద్వారా పోలీస్‌ యూనిఫాంతో ప్రత్యక్షమయ్యాడు.

ఆకాష్ కులహరి వెంకటేశ్వరరావును మరింత భయపెట్టాడు. ఈ వ్యవహారంలో కోర్టుకు కొంత మొత్తం డిపాజిట్‌ చేయాలని.. కేసు పూర్తయిన తర్వాత తిరిగి ఆ డబ్బులు తీసుకోవచ్చన్నాడు. ఈమేరకు తాము చెప్పిన అకౌంట్‌లో రూ.7.60 లక్షలు డిపాజిట్‌ చేయాలని.. నేషనల్‌ సీక్రెట్‌ లా మేరకు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితిలో కుటుంబ సభ్యులతో సహా ఎవరికి చెప్పకూడదని హెచ్చరించాడు. వెంకటేశ్వరరావు భయంతో అంగీకరించి.. తన దగ్గరున్న డబ్బుతో పాటు మిగిలింది అప్పు చేసి వారు చెప్పిన  అకౌంట్‌లకు పంపారు

డబ్బులు పంపిన తర్వాత ఫోన్ చేసిన వ్యక్తుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.. ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాలేదు. డబ్బులు తీసుకోవడం, ఫోన్లు పనిచేయకపోవడంతో వెంకటేశ్వరరావు తాను మోసపోయినట్లు గుర్తించారు. ఈమేరకు సోమవారం జిల్లా ఎస్పీ జాషువాకు ఫిర్యాదు చేయగా.. ఆయన పెనమలూరు పోలీసులను కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు సందీప్‌రావు, ఆకాష్‌కులహరి, మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..