Andhra News: పెళ్లి వేడుకలో చోరీ.. దొంగలు ఏమెత్తుకెళ్లారో తెలిస్తే అవాక్కే..

గుంటూరు జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం రేపాయి. తెనాలిలో జరిగిన పెళ్లివేడుకకు హాజరైన తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి బ్యాగ్‌ను దొంగలు ఎత్తుకెళ్లగా.. కొల్లిపర మండలం తూములూరులో ఇంట్లోకి చొరబడిన దొంగలు రూ.10లక్షల విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Andhra News: పెళ్లి వేడుకలో చోరీ.. దొంగలు ఏమెత్తుకెళ్లారో తెలిస్తే అవాక్కే..
Andhra News

Updated on: Oct 03, 2025 | 3:02 PM

పెళ్లివేడుకకు హాజరైన తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి కార్లో పెట్టిన బ్యాగ్‌ను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో వెలుగుచూసింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ ఐఆర్‌ఎస్‌ అధికారి చెంచుపేటలోని ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం రాత్రి జరిగిన ఒక వివాహానికి వచ్చాడు. తన కార్‌ను పంక్షన్ హాల్‌ బయట పార్క్‌ చేసి లోపలికి వెళ్లాడు. పెళ్లి ముగిసిన తర్వాత తిరిగి వెళ్దామని పార్క్‌ చేసిన కార్‌ దగ్గరకు వెళ్లగా అక్కడ ఆయనకు షాకింగ్‌ దృశ్యాలు కనిపించాయి.

తన కారు అద్దాన్ని ఎవరో పగల గొట్టి అందులో ఉన్న తన బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. బ్యాగ్‌లో రూ.5లక్షల నగదు, రూ.10లక్షల విలువైన బంగారం, 3 ఐఫోన్‌లు, పాస్‌పోర్ట్‌, క్రెడిట్‌ కార్డులు ఉన్నట్టు ఆయన తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రీ టౌన్‌ పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా కొల్లిపర మండలం తూములూరులో మరో దొంగతనం జరిగింది. రాత్రి ఎవరూలేని ఓ ఇంట్లోకి చొరబడిన కొందరు దుండగులు.. బీరువాను పగులగొట్టి అందులో ఉన్న రూ.10లక్షలు విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. ఇంటి యజమాని తిరిగి వచ్చి చూసేసరిగి ఇంట్లో బీరువా తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్టు భావించి పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.