TS RTC Special Buses: సంక్రాంతి పండగను పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి తెలంగాణ సహా ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలు, ఏపీకి మొత్తం 4,980 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ మేనేజర్ బి. వరప్రసాద్ వెల్లడించారు. వీటిలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3,380 ప్రత్యేక బస్సులు, ఏపీకి 1,600 బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించారు. నగరంలోని ఎంజీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్, సెంట్రల్ బస్ స్టేషన్, ఉప్పల్ క్రాస్రోడ్, ఎల్బీనగర్, చందానగర్, కేపీహెచ్పీ, లింగంపల్లి, అమీర్పేట, దిల్సుఖ్నగర్, ఎస్ఆర్ నగర్ తదితర బస్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక బస్సులు ఉంటాయని వెల్లడించారు.
ఏపీలోని విజయవాడ, విజయనగర్, రాజమండ్రి, గుడివాడ, గుంటూరు, తెనాలి, కాకినాడ, రాజోలు, మచిలిపట్నం, పోలవరం, ఏలూరు, తాడేపల్లి గూడెం, తణుకు, విశాఖ, భీమవరం, శ్రీకాకుళం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి తదితర ప్రాంతాలకు సంక్రాంతి పండగకు ప్రత్యేక బస్సులను నడపున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే పండగకు వెళ్లేవారి కోసం అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. www.tsrtconline.in వెబ్సైట్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.