Andhra Pradesh: మహిళా దినోత్సవ వేళ అడవి ఆడబిడ్డల గుండె ఘోష.. ఆ నాలుగు కిలోమీటర్లు..!

తరాలు మారినా వారి తలరాతలు మాత్రం మారడం లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ అనకాపల్లి జిల్లాలో గిరిజన ఆడబిడ్డల ఆవేదనతో ప్రదర్శన చేశారు. తలపై అడ్డాకులు పెట్టుకుని డోలీ మోస్తూ నిరసన తెలిపారు. కొండలు గుట్టలో దాటుకుంటూ.. నాలుగో కిలోమీటర్లు నడిచారు. తమ ఆవేదన వినండి మహాప్రభో అంటూ విన్నవించారు.

Andhra Pradesh: మహిళా దినోత్సవ వేళ అడవి ఆడబిడ్డల గుండె ఘోష.. ఆ నాలుగు కిలోమీటర్లు..!
Tribal Women Protest

Edited By: Balaraju Goud

Updated on: Mar 07, 2025 | 6:07 PM

తరాలు మారినా వారి తలరాతలు మాత్రం మారడం లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ అనకాపల్లి జిల్లాలో గిరిజన ఆడబిడ్డల ఆవేదనతో ప్రదర్శన చేశారు. తలపై అడ్డాకులు పెట్టుకుని డోలీ మోస్తూ నిరసన తెలిపారు. కొండలు గుట్టలో దాటుకుంటూ.. నాలుగో కిలోమీటర్లు నడిచారు. తమ ఆవేదన వినండి మహాప్రభో అంటూ విన్నవించారు. పాలకులు అధికారుల తీరుపై ఆవేదన చెందుతూ.. తమ కష్టాలు తీరేదెన్నడూ అంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు ఆ అడవి బిడ్డలు.

అనకాపల్లి జిల్లా రావికమతం, వి.మాడుగుల మండలాల సరిహద్దులో సామలమ్మ కొండపై గిరిజనులు నివసిస్తున్నారు. జీలుగులోవ, పశువుల బంధ, సోంపురం బంధ, సామలమ్మ కొండ ఆదివాసి గిరిజనులు తరతరాలుగా జీవనం సాగిస్తున్నారు. వీరంతా అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్నారు. కనీస సౌకర్యాలు వీళ్లకు ఉండవు. విద్య వైద్యం మాట దేవుడు ఎరుగు.. తాగేందుకు కనీసం మంచినీరు సౌకర్యాలు కూడా లేవు. మహిళా గర్భం దాలిస్తే వాళ్ల భయం, బాధ వర్ణనాతీతం. ఎందుకంటే.. అత్యవసరమైనా.. అనారోగ్యమైనా.. డోలీ కట్టాల్సిందే. ఎందుకంటే ఆ ప్రాంతానికి రోడ్డు సౌకర్యం ఉండదు. వాహనాలు వెళ్ళవు. అత్యవసరమైతే డోలి కట్టి కిలోమీటర్ల మేర కొండలు గుట్టలు రాళ్లు దాటుకుంటూ వెళ్లాల్సిందే. బిడ్డ కడుపులో పడి కాన్పు వరకు ప్రాణాలు ఉంటాయో లేవో అన్న ఆందోళనతో ఉంటారు ఇక్కడి ఆడబిడ్డలు, గిరిజనులు.

అధికారుల చుట్టూ తిరిగినా.. పాలకులను విన్నవించినా వారి కష్టాలు తినడం. దీంతో ఇక చేసేది లేక ఆదివాసీ మహిళలు నిరసన బాట పట్టారు. మహిళా దినోత్సవం వేల వినూత్నంగా నిరసన తెలిపి తమ ఆవేదన చెప్పే ప్రయత్నం చేశారు. సామలమ్మ కొండ నుంచి.. తలపై అడ్డాకులు పెట్టుకుని డోలి కట్టి నడిచారు. రాళ్లు రప్పలు, కొండలు, గుట్టలు దాటుకుంటూ నాలుగు కిలోమీటర్ల వరకు నిరసన ప్రదర్శన చేశారు. రావికమతం మండలం బంగారు బందరు రోడ్డు వరకు డోలీ యాత్ర చేశారు. విద్య, వైద్యం, తాగునీరు సౌకర్యం లేక అష్టకష్టాలు పడుతున్నామని గిరిజన ఆడబిడ్డలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సౌకర్యం లేక గర్భిణీల డోలీ మోతలతో ప్రాణాలు ఉంటాయో లేదో అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ గోడు విని అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ అయినా తమ కష్టాలు తీర్చాలని కోరారు కిల్లో సీతమ్మ, సేదరి చిలకమ్మ ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..