
కొత్తపేటకు చెందిన భవిరిశెట్టి ఆనంద్ మహేష్, మణిదీపిక దంపతుల ఏకైక కుమార్తె రేవతి (12) స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆదివారం కావడంతో రేవతి సమీపంలోని తమ స్నేహితుల ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళింది. ఆ మూడంతస్తుల భవన యజమాని కోటేశ్వరరావు కుటుంబం కొన్నిరోజుల కిందటే నూతనంగా లిఫ్ట్ను ఏర్పాటు చేసుకుంది.
పిల్లలు ఆడుకుంటున్న సమయంలో సాయంత్రం వేళ ప్రమాదవశాత్తు రేవతి ఆ లిఫ్ట్లో ఇరుక్కుపోయింది. లిఫ్ట్ నుంచి ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వచ్చి చూడగా, రేవతి తీవ్ర గాయాలతో పడిపోయి ఉంది. రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆడుకోవడానికి వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ఏకైక కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే, ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డోర్లు సరిగ్గా మూసుకోకుండానే లిఫ్ట్ పైకి వెళ్లడం, ప్లాస్టిక్ షీట్లు పగిలిపోవడం వంటి అంశాలను లేవనెత్తుతూ ఇది కేవలం ప్రమాదం కాదని, దీని వెనుక వేరే కారణాలు ఉండవచ్చని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న సత్తెనపల్లి డీఎస్పీ చైతన్య క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు. భవనంలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని, లిఫ్ట్లోని సాంకేతిక లోపాలు లేదా నిర్వహణ లోపాలపై విచారణ జరుపుతున్నారు. ఘటన జరిగిన తీరుపై సమగ్ర దర్యాప్తు జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.