Andhra Pradesh: ఓర్నీ.. 2 నెలల క్రితం కొనే దిక్కులేదు.. ఇప్పుడేమో…

|

Jun 17, 2024 | 8:02 PM

టమాటా ధర మళ్లీ పెరుగుతోంది. మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మదనపల్లె మార్కెట్‌లో 80 రూపాయలకు చేరిన కిలో టమాటా రేట్‌.. సెంచరీ దిశగా దూసుకెళ్తోంది.

Andhra Pradesh: ఓర్నీ.. 2 నెలల క్రితం కొనే దిక్కులేదు.. ఇప్పుడేమో...
Tomato
Follow us on

టమాటా ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నప్పటికీ వాటిని మించిన వేగంతో టమాటా దూసుకుపోతోంది. వేసవి కాలంలో కాస్తంత పర్వాలేదనిపించినప్పటికీ వర్షాకాలం వచ్చేసరికి మాత్రం కూరగాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

రెండు నెలల క్రితమే సరైన ధర లేదంటూ రైతులంతా టమాటాలను రోడ్డు మీద పారపోశారు. అయితే ప్రస్తుతం అదే టమాటా 100కు చేరువలో ఉంది. మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో కిలో టమాటా ధర 80 రూపాయలకు చేరింది. గత వారం రోజులుగా మదనపల్లె మార్కెట్‌లో ధర అత్యల్పంగా కిలో 41 రూపాయల నుంచి అత్యధికంగా 64 రూపాయల మధ్య ఉంది. సోమవారం మాత్రం ఏ గ్రేడ్ కిలో 69 నుంచి 80 రూపాయల వరకు, బీ గ్రేడ్ 50 నుంచి 68 రూపాయల వరకు ధర పలికింది.

ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల పరిధిలో సరకు తగ్గడంతో పాటు, దేశవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో టమాటా దిగుబడి తగ్గింది. దీంతో నాణ్యమైన సరకు మార్కెట్‌కు రావడం లేదు. ఈ పరిస్థితులు ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే మదనపల్లె మార్కెట్‌కు డిమాండ్ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

మార్కెట్‌కు రోజూ 600 టన్నుల నుంచి 750 టన్నుల మేరకు సరకును రైతులు తీసుకొస్తున్నారు. సోమవారం మార్కెట్‌కు ఎగుమతికి అవసరమైన దాని కంటే తక్కువగా వచ్చింది. మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాల నుంచి కేవలం 396 టన్నులు టమాటాలు మాత్రమే తీసుకొచ్చారు. దీంతో కిలో ధర 80 రూపాయలకి చేరుకుంది. రైతుల నుంచి వ్యాపారులు సగటున 25 కిలోల బుట్ట ధర 1600 నుంచి 1900 రూపాయలకు కొనుగోలు చేసి బయటి మార్కెట్లకు ఎగుమతి చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..