Tirumala: శ్రీవారి లడ్డూల తయారీకి కొత్త చిక్కు.. వినూత్న ఫార్ములాతో చెక్ పెట్టిన టీటీడీ

| Edited By: Anil kumar poka

Mar 19, 2022 | 5:49 PM

విశ్వవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన శ్రీవారి లడ్డూల తయారీకి కొత్త చిక్కువచ్చి పడింది. ఆ సమస్యకు అధికారులు ఏం పరిష్కారం చూపారో తెలుసుకుందాం పదండి...

Tirumala:  శ్రీవారి లడ్డూల తయారీకి కొత్త చిక్కు.. వినూత్న ఫార్ములాతో చెక్ పెట్టిన టీటీడీ
Ttd Laddu
Follow us on

Ttd: తిరుమల శ్రీవారి లడ్డూ తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన తిరుమల లడ్డూల తయారీకి కొత్తచిక్కు వచ్చి పడింది టీటీడీకి. తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ(Srivari Laddu) ప్రసాదాలను అర్చకులు నిర్ణయించిన దిట్టం ప్రకారం త‌యారు చేస్తుంది టీటీడీ. ప్రతిరోజూ 4 లక్షల ల‌డ్డూలు శ్రీ‌వారి ఆల‌యపోటులో తయారవుతాయి. ల‌డ్డూల తయారీలో శ‌న‌గ‌పిండి, చ‌క్కెర‌, యాలక‌లు, ఎండు ద్రాక్ష, జీడిప‌ప్పుతోపాటు నెయ్యిని వాడుతారు. వీటిలో నాణ్యమైన వాటిని గుర్తించి టీటీడీ కొనుగోలు చేస్తుంది. ప్రసాదాల త‌యారీకి రోజుకు 4 వేల నుండి 5వేల కేజీల వ‌ర‌కు బ‌ద్ద జీడిప‌ప్పు అవ‌స‌ర‌మ‌వుతుంది. కొద్దికాలంగా టీటీడీకి బద్ద జీడిప‌ప్పు కొర‌త‌ ఏర్పడింది. ప‌లుసార్లు టెండ‌ర్లు పిలిచినా నాణ్యమైన బద్ద జీడిప‌ప్పు దొరకడం లేదు. దీంతో భవిష్యత్‌ అవ‌స‌రాల కోసం ఏం చెయ్యాలన్న దానిపై టీటీడీ కొత్త ఆలోచన చేసింది. కేరళ(Kerala)లో జీడిప‌ప్పు గుండల్‌ను బద్దజీడిపప్పుగా మార్చే ప్రక్రియను తెలుసుకున్న టీటీడీ.. కేర‌ళ‌కు ప్రత్యేక బృందాన్ని పంపి అధ్యయనం చేయించింది. బ‌ద్ద జీడిప‌ప్పు కొనుగోలుకు ఇత‌రుల‌పై ఆధారప‌డ‌కుండా సొంతంగా కేరళ విధానాన్ని అనుసరించాలని..జీడిప‌ప్పును బద్దలుగా మార్చుకుంటేనే బాగుంటుందని అధికారుల బృందం టీటీడీకి సూచించింది. అందుకు టీటీడీ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. కేరళలో ప్రసాదానికి బద్దజీడిపప్పు తయారీ ప్రక్రియను టీటీడీలోనూ అమలు చేస్తూ సమస్యను అధిగమించింది. దీంతో సొంతంగా జీడిప‌ప్పు బద్దలను తయారు చేసుకునే వెసులుబాటు క‌లిగింద‌ని చెబుతున్నారు టీటీడీ అధికారులు. ఇక శ్రీవారి లడ్డూల తయారీకి ఏ ఆటంకం లేదని స్పష్టం చేస్తున్నారు.

Also Read: Nalgonda: వీడిన మిస్టరీ.. కారును కాలువలోకి తోసేసింది వారే.. వెలుగులోకి కీలక విషయాలు