
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ కేసులో నోటీసులు జారీ చేశారు పోలీసులు.
మూడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ కారణంగా ఈ నెల 15 తర్వాత విచారణకు వస్తానని లిఖిత పూర్వకంగా పోలీసులకు తెలిపారు మంచు విష్ణు. అయితే.. ఈ కిడ్నాప్ కేసులో మోహన్బాబుకు మాత్రం నోటీసులు ఇంకా అందలేదు.
తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగిన కిడ్నాప్ ఘటనలో మోహన్బాబు, విష్ణు, పీఆర్వో సతీష్పై సహా 13మందిపై ఈ నెల 3న కిడ్నాప్ కేసు నమోదైంది. విద్యార్థులు అక్బర్, వినోద్ను కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల దోపిడీపై SFI నేతలు కలెక్టరేట్ ముట్టడికి సిద్దమవుతుండగా.. ఇద్దరు విద్యార్థి నేతలను బౌన్సర్లు కిడ్నాప్ చేశారని ఆరోపించారు విద్యార్థి నేతలు. SFI నేతలు అక్బర్, వినోద్ను బౌన్సర్లు బలవంతంగా కారులో తీసుకెళ్లారని.. మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేయించిందని పోలీసులకు CPM నేతలు ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్ వ్యవహారంపై తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గర విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేశారు. కాలేజీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు బయటపెడితే కిడ్నాప్ చేస్తారా.. మీ కాలేజీలో విద్యార్థులకు ఇదే నేర్పుతున్నారా అని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించారు.
మరోవైపు వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని విద్యార్థి సంఘాల నేతలపై యూనివర్సిటీ పీఆర్వో సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ యాజమాన్యాన్ని డబ్బు కూడా డిమాండ్ చేశారన్నారు. దీంతో విద్యార్థి సంఘం నేత అక్బర్తో పాటు మరికొందరిపై చంద్రగిరి పీఎస్లో కేసు నమోదైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.