
అంబేద్కర్ కోనసీమ జిల్లా యానాంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పులస చేపల సీజన్ మొదలైంది. గోదావరికి ఎర్రనీరు చేరడంతో ఈ ఏడాది తొలి పులస చేప యానాం మార్కెట్కు చేరింది. సుమారు కిలోన్నర బరువున్న ఈ పులస యానాం సమీపంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు చిక్కింది. దీంతో మత్స్యకారుల్లో ఆనందం నెలకొంది.
యానాం చేపల మార్కెట్లో జరిగిన వేలంలో ఈ తొలి పులసను మత్స్యకార దంపతులు పోనమండ భద్రం, రత్నం 14 వేల రూపాయలకు దక్కించుకున్నారు. అనంతరం మరో రూ.500 లాభంతో అదే పులసను రూ.14,500కు మరో మత్స్యకారుడికి విక్రయించారు. సీజన్లో తొలి పులసకు మంచి డిమాండ్ ఉండటంతో మార్కెట్లో కొనుగోలుదారుల మధ్య పోటీ నెలకొంది.
గౌతమి గోదావరికి వరద నీరు, ఎర్రనీరు పోటెత్తే సమయంలో సముద్రం నుంచి పులస చేపలు నదిలోకి ప్రవేశిస్తాయని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రస్తుతం గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో రానున్న రోజుల్లో మరిన్ని పులసలు వలకు చిక్కే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పులస ప్రత్యేక రుచి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చేపకు భారీ డిమాండ్ ఉండటంతో, సీజన్ ప్రారంభం కావడంతో మాంసాహార ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..