AP News: పేకాట కేసులో గుట్టురట్టు..సంచలన నిజాలు బయటపెట్టిన పోలీసులు

| Edited By: Velpula Bharath Rao

Oct 20, 2024 | 7:05 PM

ఓ పేకాట కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. తీగ లాగితే డొంకంతా కదలినట్లు పోలీసులు అనూహ్య నిజాలు వెల్లడించారు. ఈ ఘటనలో పలువురు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఇంతకీ ఏం జరిగింది? పోలీసులను ఎందుకు సస్పెండ్ చేశారో మీరో చూడిండి..

AP News: పేకాట కేసులో గుట్టురట్టు..సంచలన నిజాలు బయటపెట్టిన పోలీసులు
Poker Case Twist'
Follow us on

ఏలూరు: తూర్పుగోదావరి జిల్లా మండలం ముక్కామలలో సెప్టెంబర్ 8న కొందరు వ్యక్తులు పేకాడుతున్నారు. సమాచారం అందుకున్న పెరవలి ఎస్సై అప్పారావు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు రైడ్‌కి వెళ్లారు. పేకాట శిబిరంపై దాడిలో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.6.45 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేసులో మాత్రం రూ.55 వేలు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు చూపించారు. మిగిలిన డబ్బులు తలా కాస్త పంచుకుని నిందుతులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. అయితే ఇక్కడే కధ మలుపు తిరిగింది. రైడ్ జరిగిన సమయంలో ఉన్న టీంలో ఒక కానిస్టేబుల్‌కి నిందితుల్లో ఒకరితో బాగా పరిచయం ఉంది. దాంతో అతడు రూ. లక్ష కానిస్టేబుల్‌కి ఇచ్చి జాగ్రత్తగా దాయమని చెప్పాడు. ఆ తర్వాత లక్ష నగదు దాయమని ఇచ్చిన వ్యక్తి కానిస్టేబుల్ వద్దకు వెళ్లి తన నగదు ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే ఆ లక్ష కూడా రైడ్ అమౌంటులో కలిసిపోయిందని కానిస్టేబుల్ చెప్పటంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది.

కానిస్టేబుల్ తన దగ్గర ఎటువంటి అమౌంట్ లేదని చెప్పడంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. దాంతో ఆ వ్యక్తి రైడ్ జరిగిన రోజు కానిస్టేబుల్‌కు తాను ఇచ్చిన లక్ష రూపాయలు నగదు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను జిల్లా ఉన్నతాధికారులకు పంపించాడు. దానిపై రహస్య విచారణ జరిపిన జిల్లా ఉన్నతాధికారులు మొత్తం వ్యవహారాన్ని బయటకు తీశారు. లక్షల రూపాయలు సైడ్ అయ్యాయని గుర్తించారు. వెంటనే పెరవలి ఎస్సై అప్పారావుని, రైటర్ బుద్దిశ్వరుడు, కానిస్టేబుల్ చల్లారావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారితోపాటు నిడదవోలు సర్కిల్ పరిధిలో ఘటన జరిగిన నేపథ్యంలో నిడదవోలు సీఐ శ్రీనివాసులు కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇలా పెరవలిలో పోలీసులు సస్పెండ్ అయ్యారో లేదో ఏలూరులో మరో రైడ్లో ఏకంగా ముగ్గురు పోలీసులు పేకాడుతూ దొరికిపోయారు. శనివారపుపేట అబ్బిరెడ్డి అపార్ట్‌మెంట్‌లో గత కొంత కాలంగా పేకాట జరుగుతోంది. అయితే దీనిపై జరిగిన పోలిసుల దాడిలో ముగ్గురు కానిస్టేబుల్స్‌‌తో పాటు మరో 8 మంది వ్యక్తులు అరెస్టు అయ్యారు. వీరిలో కానిస్టేబుల్ రవికుమార్ (ట్రాఫిక్) , B. ప్రకాష్ (భీమడోలు), A. శ్రీనివాస్ (ఏఆర్ భీమవరం.) ఉన్నారు. వీరి వద్ద నుండి రూ.2,35,500 నగదు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.