
ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో చిరుత పులి సంచారం మరోసారి స్థానికుల్లో భయాందోళన గురిచేసింది. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం సప్పర్ల రెయిన్గేజ్ వద్ద మూడు రోజుల క్రితం చిరుత పులి సంచరించిందని స్థానికుల చెప్పడంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. రెయిన్గేజ్ రోడ్డు పక్కనే చిరుత పులిపాద ముద్రలను గుర్తించారు. సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. మరీ ముఖ్యంగా నిమ్మలగుంది, పనసల బంధ, నూతల బంధ, లంకపాకలోని జనాలకు అవగాహన కల్పించారు.
చిరుత సంచరించిన ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాలని స్థానికులకు తెలిపారు అటవీశాఖ అధికారులు. ఎట్టి పరిస్థితుల్లో అడవిలో నిప్పు పెట్టొద్దని… అలా నిప్పు పెట్టడం వల్ల వన్యప్రాణులకు జరిగే నష్టంతో పాటు అవి జవాసాల్లోకి దూసుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతేకాదు పోస్టర్లు అంటిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.
సప్పర్ల, ధారకొండ ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచరిస్తున్నందున ఆ ప్రాంతంలో ప్రజలతో పాటు వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే ద్విచక్ర వాహనాలపై ఈ ప్రాంతంలో ఒంటరిగా ప్రయాణం చేయవద్దని.. కాలినడకని కూడా గుంపుగానే వెళ్లాలని సూచించారు. రెయిన్గేజ్ ప్రాంతానికి పర్యాటకులు సమూహంగా వెళ్లాలని అన్నారు. కుక్కలతో పాటు ఆహారం కోసం అటవీ ప్రాంతం నుంచి చిరుత జనావాసాలకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. చిరుత సంచారంపై సమాచారం ఉంటే వెంటనే తమకు తెలియజేయగలరని సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..