నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుతూ టీడీపీ నేతలు పూజలు చేశారు. నారాయణ హృదయాలయ ఆస్పత్రిలోని వినాయకగుడిలో హిందూపురం తెలుగుదేశం పార్టీ నేతలు 101 కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. తారకరత్నను బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్పారు టిడిపి హిందుపూర్ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ అంబికా లక్ష్మీనారాయణ. తారకరత్నకు ఇవాళ తీసిన స్కాన్ రిపోర్ట్ వస్తే, ఆరోగ్యపరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందన్నారు. పరిస్థితిని బట్టి తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారని తెలిపారు అంబికా లక్ష్మీనారాయణ.
వారం రోజులుగా వెంటిలేటర్పైనే ఉన్నారు తారకరత్న. బెంగళూరు నారాయణ హృదయాలయా ICUలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. గుండె బాగానే పనిచేస్తోందని చెబుతున్నారు వైద్యులు. కానీ బ్రెయిన్ డ్యామేజ్ అయిందని చెప్పడం ఆందోళనకు గురి చేస్తోంది. ఐతే మెదడును తిరిగి పనిచేయించడంపైనే దృష్టి పెట్టారు వైద్యులు. నారాయణ హృదయాలయ, నిమ్హాన్స్ డాక్టర్లు..తారకరత్నను కోమాలో నుంచి బయటికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యూరో సర్జన్లతో పాటు 10మంది వైద్యుల బృందం..ఆయన హెల్త్ కండీషన్ను నిరంతరం పర్యవేక్షిస్తోంది.
ఈ నెల 27న గుండెపోటు టైమ్లో 45 నిమిషాలపాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు తెలిపారు డాక్టర్లు. ప్రస్తుతం మెదడులో స్వెల్లింగ్ క్రమంగా తగ్గుతోందని, వాపు తగ్గిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో తారకరత్న కోలుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ అలా జరగని పక్షంలో.. పరిస్థితిని సమీక్షించి.. కుటుంబ సభ్యులతో చర్చించి.. మెరుగైన ట్రీట్మెంట్ కోసం విదేశాలకు తరలించే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..