
అసలే వేసవి కాలం.. భానుడి భగభగలు… గొంతు తడుపుకునేందుకు మనుషులే అల్లాడి పోతున్న పరిస్థితి… నోరున్న మనుషుల పరిస్థితే ఇలా ఉంటే నోరు లేని పక్షుల పరిస్థితి తలుచుకుంటే నే అయ్యో అనిపిస్తుంది కదా. కొందరికి అయ్యో అని మాత్రమే అని పిస్తుంది కానీ, ఏమీ చేయలేరు అయ్యో అనడం తప్ప. అయితే నోరు లేని పక్షుల దాహార్తి తీర్చేందుకు ముందుకు వచ్చారు ఓ పాఠశాల విద్యార్థులు. చదువుతున్నది ఏడు, ఎనిమిది తరగతులు అయినా ధరణి దినోత్సవం రోజు ఇకపై ప్రతి రోజు పక్షుల దాహార్తి తీర్చాలని ప్రతిజ్ఞ పునారు.
నెల్లూరు జిల్లాఉదయగిరి మండలం కృష్ణంపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో ముందడుగు వేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పక్షులు అల్లాడిపోతుండటం చూసిన విద్యార్థులు వాటికి నీరు అందించాలని ముందుకు వచ్చారు.. పార వేసిన ప్లాస్టిక్ డబ్బాలను సేకరించి, వాటిని నీటి పాత్రలు, ఆహార గిన్నెలుగా మార్చారు. స్కూల్ ఆవరణలోని చెట్లకు వాటిని కట్టి పక్షులకు నీరు, ఆహారం అందిస్తున్నారు. చిన్న ప్రయత్నమే అయినా, పర్యావరణానికి పెద్ద సందేశంగా మారింది.
ఈ కార్యక్రమానికి ఆ పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు మన్సూర్ ఆలీ మార్గదర్శకత్వం వహించారు. విద్యార్థులతో కలిసి స్వయంగా పాల్గొని పక్షుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఎండల కాలంలో పక్షులకు నీరు ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యకమాన్ని కేవలం ధరణి దినోత్సవానికే పరిమితం కాకుండా, వేసవి కాలమంతా పక్షులకు నీరు, ఆహారం అందిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. కృష్ణంపల్లి విద్యార్థుల ఈ ప్రయత్నంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.