Weather Report: సెగలు కక్కుతున్న భానుడు.. ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ సమయంలో జాగ్రత్త

ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో మధ్యాహ్నం వేళల్లో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. వేసవి కాలం కావడంతో భానుడు సెగలు కక్కుతున్నాడు. దీంతో ఏపీలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది.

Weather Report: సెగలు కక్కుతున్న భానుడు.. ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ సమయంలో జాగ్రత్త
Heatwave

Updated on: May 21, 2026 | 10:42 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. గరిష్ట స్థాయిలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకి రికార్డు సృష్టిస్తు్న్నాయి. ఈ క్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న నాలుగురోజులు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఓ ప్రకటన జారీ చేసింది. మే 21న పార్వతీపురంమన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో 45°C నుంచి 47°C డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది.

అంచనాలు

-కోనసీమ, ఉమ్మడి గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.విజయనగరం, మార్కాపురం జిల్లాల్లో 44°C నుంచి 45°C డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఇక శ్రీకాకుళం,విశాఖ, నెల్లూరు,రాయలసీమ జిల్లాల్లో 40°C నుంచి 43°C డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని స్పష్టం చేసింది. అలాగే గురువారం 74 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 232 మండలాల్లో వడగాల్పులు ఉంటాయని, శుక్రవారం 24 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 270 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని అంచనా వేసింది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెత్తికి టోపీ లేదా రుమాలు కట్టుకోవాలి. తెలుపురంగు కాటన్ దుస్తులను ధరించాలి. కళ్ళకు సన్‌గ్లాసెస్ ఉపయోగించాలి. దాహం వేయకపోయినా తరుచుగా వాటర్ తాగుతూ ఉండాలి. మజ్జిగ, గ్లూకోజ్, ఓఆర్ఎస్ వంటి వాటిని తీసుకోవాలి. ఇక నిమ్మరం, కొబ్బరినీరు వంటి వాటిని తీసుకుంటే మరింత మంచిది. ఎండ నుంచి ఇంటికి రాగానే చల్లని నీరుతో స్నానం చేయండి. ఇంటి పై కప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్‌ను ఉపయోగించడం వల్ల రూమ్ చల్లగా ఉంటుంది. మేడపైన, ఇంట్లో మొక్కలు పెంచుకుంటే ఇంట్లో వాతావరణం చల్లగా ఉంటుంది. వాంతి, వికారం, తలనొప్పి, తలతిరగడం, జ్వరం వంటివి వడదెబ్బ లక్షణాలు. ఈ లక్షణాలు మీరో కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోండి.

ఈ పనులు చేయకండి

-ఎండలో గొడుగు లేకుండా తిరగకండి

– నలుపురంగు, మందంగా ఉండే దుస్తులు ధరించకండి

-శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటెడ్ శీతల పానీయాలు తీసుకోకండి

-అధిక ప్రోటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే పదార్థాలను తీసుకోకండి

-ఎక్కువ ప్రకాశంతంగా వెలిగే బల్బులను వాడటం మానుకోండి. ఇవి ఎక్కువ వేడిని విడుదల చేస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us