
ఎండలు మనుషులనే కాదు జంతు, జీవజాతులకు కూడా చెమటలు పట్టిస్తున్నాయి. మెట్ట ప్రాంతాల్లో ఉండే పాములు ఎండవేడికి తట్టుకోలేక గ్రామాల్లోని ఇళ్లల్లోకి, పశువుల కొష్టాల్లోకి నిలువ నీడ కోసం వస్తున్నాయి. మార్కాపురంజిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల పాములు నివాస ప్రాంతాల్లోకి రావడంతో జనం భయంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. స్నేక్ క్యాచర్ మల్లికార్జునసాయంతో రెండు పాములను పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు.
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరంలో 5 అడుగుల త్రాచుపాము కలకలం రేపింది. అంజిరెడ్డి అనేవ్యక్తి తన ఇంటి ఆవరణలోకి వచ్చిన తాచు పాముని చూసి హడలి పోయాడు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. స్నేక్ క్యాచర్ మల్లికార్జున చేరుకుని పామును పట్టుకున్నాడు. పడగ విప్పి బుస కొడుతున్న 5 అడుగుల త్రాచుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు. ఓ ప్లాస్టిక్ గోనె సంచిలో పామును బంధించి తీసుకెళ్ళాడు. పాములు పర్యావరణ సమతుల్యతకు దోహదపడతాయని అవి కనిపిస్తే చంపవద్దని స్నేక్ క్యాచర్ మల్లికార్జున గ్రామస్థులకు సూచించారు. చాకచక్యంగా పట్టుకున్న అత్యంత విషపూరితమైన తాచుపామును అనంతరం అడవిలో వదిలేసారు.
ఇదే మండలంలోని ఎండూరివారిపాలెంలో జెర్రిపోతు హడలెత్తించింది. స్థానిక మెడికల్ సబ్ సెంటర్లోకి జెర్రీ పోతు పాము దూరింది. జెర్రిపామును చూసి హడలిపోయిన ఉద్యోగులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ కుడా స్నేక్ క్యాచర్ మల్లికార్జున వచ్చి జెర్రిపోతును పట్టుకుని అటవీప్రాంతంలో వదిలేశారు. ఎండ వేడికి తట్టుకోలేక మైదాన ప్రాంతాల నుంచి జననివాస ప్రాంతాల్లో చల్లని ప్రదేశాలకు పాములు వలస వస్తున్నాయని, వీటిని చూసినవారు వాటిని చంపకుండా తమకు సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు గ్రామస్థులకు విజ్ఞప్తి చేస్తున్నారు.