ఏపీ రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చినా.. ఇంకా దీనిపై చర్చ కొనసాగుతూనే ఉంది. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని.. పార్లమెంట్ వేదికగా కేంద్రమంత్రి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే అంశంపై అటు బీజేపీ ఎంపీ జీవీఎల్ కూడా స్పందించారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే జీవీఎల్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రతన్ శార్దా అభ్యంతరం మండిపడ్డారు. జీవీఎల్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేశారు.
రాజధానిపై జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు సాంకేతికంగా సరైనవేనని అంటూనే.. మరోవైపు ఖండించారు. ఇప్పటి వరకు రాజధానిపై పెట్టిన వేల కోట్ల పెట్టుబడుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
రూ. వేల కోట్ల ప్రజాధనం వృథా అవుతుంటే కేంద్రం పట్టించుకోదా..? రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల మనోభావాలతో ఆడుకుంటారా అని జీవీఎల్ లక్ష్యంగా ఎదురు ప్రశ్నలు కురిపించారు. రైతుల భవిష్యత్తో జగన్ ఆడుకుంటుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా..? జగన్ విచిత్రమైన ఆలోచనలకు మద్దతు ఎలా ఇస్తారంటూ రతన్ శార్దా ట్వీట్ చేశారు. అటు ఏపీ బీజేపీ పరిస్థితిపైనా కూడా స్పందించారు. వనరుల దుర్వినియోగంపై పోరాడే పార్టీగా, మతమార్పిళ్లకు వ్యతిరేకంగా నిలిచే పార్టీగా ఏపీలోనూ బీజేపీ తనదైన శైలిలో వెళ్లాల్సిన అవసరముందుంటూ పేర్కొన్నారు.