Road Mishap at Tirumala: తిరుమల కొండపై ఓ భారీ ప్రమాదం తప్పింది. డ్రైవర్ లేకుండా ఓ జీపు దూసుకువచ్చి వచ్చి బోల్తా పడింది. అది చూసిన భక్తులు హడలిపోయారు. పెట్రోల్ బంక్ వద్ద నుండి బాలాజీ బస్టాండ్ వరకు దాదాపు 100 మీటర్లు పాటు ఓ జీపు డ్రైవర్ లేకుండా దూసుకురావడం గమనించిన భక్తులు తోటి భక్తులను కూడా హెచ్చరించారు. దాంతో అందరూ పక్కకు తప్పుకున్నారు. భక్తుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణంగా తెలుస్తోంది. పెట్రోల్ బంక్ వద్ద రోడ్డుకు అడ్డంగా బ్యారీకేడ్లు పెట్టేయడంతో వాటిని తీయడానికి డ్రైవర్ జీపును న్యూట్రల్ లో పెట్టి జీపు దిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆ సమయంలో జీపు డౌన్ కు దూసుకువచ్చింది. దాదాపు 100 మీటర్ల పాటు వేగంగా వచ్చి బస్టాండ్ వద్ద బోల్తాపడింది. ప్రమాద సమయంలో పెద్దగా జన సంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మరో కొంత దూరం పాటు జీపు దొర్లుకుంటూ వచ్చుంటే ఆ ప్రమాదాన్ని ఊహించడం కూడా కష్టమయ్యేది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామి తమను రక్షించాడని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు కారణమైన డ్రైవర్ పరారవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీపును పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు.. పరారైన డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. కాగా, ఇటీవలి కాలంలో తిరుమల క్షేత్రం పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవటం భక్తులలో ఆందోళన రేకెత్తిస్తోంది.
Also read: