Red Gram: కొండెక్కిన కందిపప్పు రేటు.. ఇప్పుడు కేజీ ఎంతో తెల్సా..?

|

May 21, 2023 | 1:14 PM

ఏపీలోని చాలా కిరాణ షాపుల్లో కందిపప్పు నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా కృత్రిమ కొరతా.. వ్యాపారుల ట్రిక్కా అంటే.. దిగుబడే తక్కువగా ఉంది కాబట్టి..ఇది ఎవరి ట్రిక్కూ కాదని తెలుస్తోంది.. కందిపప్పు కొరత మున్ముందు మరింత భయపెట్టనుంది.

Red Gram: కొండెక్కిన కందిపప్పు రేటు.. ఇప్పుడు కేజీ ఎంతో తెల్సా..?
Red Gram
Follow us on

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. రేట్లు పెరిగిపోయె.. కిరాణ కొట్టుకు వెళ్తే సరుకులు రాకపోయే.. ఓవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు మార్కెట్లో పెరుగుతున్న నిత్యావసరాల రేట్లతో సామాన్యుడు అల్లాడిపోతున్నారు. కిరాణా షాపులో ఏవస్తువు ముట్టుకున్నా రేట్లు మండిపోతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా కందిపప్పు రేటు కూడా కొండెక్కింది. నిన్న మొన్నటి వరకు నూనెల ధరలతో అల్లాడిన సామాన్యులను ఇప్పుడు కందిపప్పు భయపెడుతోంది.

పప్పు లేకుండా అన్నం తినగలమా.. కంచంలో ఎన్ని ఉన్నా పప్పు లేకపోతే దిక్కు తోచదు.. ఏదో వెలితి..మరి ఆ పప్పు అస్సలు దొరకనంటోంది. డిమాండ్‌కు సరిపడా కందిపప్పు అందుబాటులో లేకపోవడంతో సూపర్ మార్కెట్లు సహా కిరాణా దుకాణాల్లోనూ నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కాస్తోకూస్తో ఉన్న కందిపప్పును అధిక ధరలకు అమ్ముకుంటూ వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం 140కి పెరిగిన ధర 180 రూపాయల వరకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. డబుల్ సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

గతేడాది దేశంలో 43.4 లక్షల టన్నుల కందిపప్పును పండించగా, మరో 15 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నారు. అయితే, ఈ ఏడాది మాత్రం దిగుబడి 38.9 లక్షల టన్నులు దాటలేదు. దీనికి తోడు దిగుమతి విషయంలోనూ కేంద్రం అలసత్వం చేసిందన్న ఆరోపణలున్నాయి. దీంతో, క్వింటాల్ కందిపప్పుకు కేంద్రం 6,600 కనీస మద్దతు ధర ప్రకటించింది. కానీ ప్రస్తుతం క్వింటాల్ కందిపప్పు రూ. 10 నుంచి రూ. 12 వేలు పలుకుతోంది. రెండు నెలల క్రితం కిలో కందిపప్పు 100 రూపాయలు ఉండేది. ప్రస్తుతం కిలో కందిపప్పు ధర 140కి చేరింది. మున్ముందు 180 వరకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ, విశాఖ, తిరుపతిలో కందిపప్పు కొరత ఉంది. డిమాండ్‌కు సరిపడా లేకపోతే ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..