AP Rains: ఎండ, వాన.. తాజాగా పిడుగులు.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం.. తాజా వెదర్ రిపోర్ట్

ఏపీలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు వర్షం.. జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని ప్రాంతాలతో పిడుగులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వార్తలో చూసేద్దాం..

AP Rains: ఎండ, వాన.. తాజాగా పిడుగులు.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం.. తాజా వెదర్ రిపోర్ట్
Ap Rains

Updated on: Apr 28, 2025 | 6:06 PM

రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరో నాలుగు రోజులపాటు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. వాతావరణ అనిశ్చితి నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మంగళవారం (29-04-25) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

బుధవారం (30-04-25) శ్రీకాకుళంలో రెండు మూడు చోట్ల భారీ వర్షాలు, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, పల్నాడు, శ్రీసత్యసాయి,చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదన్నారు.

అలాగే రేపు విజయనగరం జిల్లా బాడంగి,బొబ్బిలి,దత్తిరాజేరు,గుర్ల,కొత్తవలస మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి,సీతానగరం మండలాల్లో వడగాలులు(08) ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఉష్ణోగ్రతలు 40-42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు.

సోమవారం వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో 41.1°C, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 41°C, నంద్యాల జిల్లా రుద్రవరంలో 40.6°C, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట 40.5°C, విజయనగరం కొత్తవలస, పల్నాడు జిల్లా నరసారావుపేటలో 40.3°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఎండ తీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.