
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, ఏపీ, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో సోమవారం వానలు పడనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఏపీలోని అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, చిత్తూరు, తిరుపతి, విశాఖపట్నంలో జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఓ మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడతాయని, పిడుగుపాటు హెచ్చరికల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది.
ఆదివారం ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కోనసీమ జిల్లాలోని ముమ్మడివరంలో 72.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. పెద్దాపురంలో 50.2 మిల్లీమీటర్లు, పిఠాపురంలో 45.5 మిల్లీమీటర్లు, కాట్రేనికోనలో 57.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు ఏపీలోని విభిన్న వాతావరణ పరిస్థితుల నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో వానలు పలకరిస్తుండగా.. మరికొన్ని జిల్లాల్లో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఆదివారం నెల్లూరు జిల్లాలో గూడురులో 46.2 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక 286 మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఇలా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది.
ఆదివారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సూర్యాపేట, హుస్నాబాద్, మంచిర్యాల, ఉమ్మడి వరంగల్, మిర్యారగూడ, నేరుడచర్ల, త్రిపురాంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఇక రాష్ట్రంలో రానున్న రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. అటు రాష్ట్రంలో కూడా ఎండలు ఠాకెత్తిస్తున్నాయి. ఆదివారం ఆరు జిల్లాల్లో డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 45.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అటు వడదెబ్బ మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో వడదెబ్బతో పంచాయతీ కార్మికుడు మాణిక్ రావు మృత్యువాత పడ్డారు. తెలంగాణలో వడదెబ్బ మరణాలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ చెబుతోంది. అటు ఉత్తర తెలంగాణను ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మరికొద్ది రోజుల పాటు ఎండలు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది. మరికొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ఎండలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. వాటర్, మజ్జిగ లాంటివి ఎక్కువగా తాగాలని సూచిస్తోంది.