ఏపీలో మట్టా ఆదిలక్ష్మి.. కానీ ఖతార్లో.. 47 ఏళ్ల పాటు తమను తల్లిలా సాకినందుకు..
ఉపాధి కోసం ఖతార్ వెళ్లిన కోనసీమ మహిళ మట్టా ఆదిలక్ష్మి.. 47 ఏళ్లపాటు ఓ అరబ్ కుటుంబానికి సేవలందించి, వారి పిల్లలకు తల్లిగా మారింది. ఆమె మరణంతో భావోద్వేగానికి గురైన షేక్ కుటుంబ సభ్యులు తమ సొంత తల్లి సమాధి పక్కనే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడం అందరినీ కదిలిస్తోంది.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన మట్టా ఆదిలక్ష్మి జీవిత గాథ ఇప్పుడు అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. 1977లో ఉపాధి కోసం ఖతార్లోని దోహాకు వెళ్లిన ఆదిలక్ష్మి, అక్కడ ఓ అరబ్ షేక్ కుటుంబంలో పనిమనిషిగా చేరారు. అయితే కాలక్రమేణా ఆమె ఆ ఇంటి సభ్యురాలిగానే మారిపోయారు.
షేక్ భార్య చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించడంతో, వారి ఏడుగురు పిల్లల బాధ్యతలను ఆదిలక్ష్మి తన భుజాలపై వేసుకున్నారు. వారిని కన్నతల్లిలా పెంచి పెద్ద చేశారు. దీంతో ఆ ఏడుగురు పిల్లలు ఆదిలక్ష్మిని తమ సొంత తల్లిగానే భావించేవారు. ఈ క్రమంలో 2007లో షేక్ కుటుంబ సభ్యుల అభిమానం, అనుబంధంతో ఆదిలక్ష్మి ఇస్లాం మతాన్ని స్వీకరించారు. అయినప్పటికీ ఆమె తన స్వగ్రామం చింతలపల్లిలో ఉన్న భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో సంబంధాలను కొనసాగిస్తూ, ప్రతి ఏడాది స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులను కలుసుకునేవారు.
ఇలా 47 ఏళ్లపాటు అదే కుటుంబానికి సేవలందించిన ఆదిలక్ష్మి ఈ నెల 5వ తేదీన ఖతార్లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరినప్పటికీ, షేక్ కుటుంబంలోని ఏడుగురు సంతానం మాత్రం “ఆమె మీ తల్లి మాత్రమే కాదు.. మన తల్లీ” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆదిలక్ష్మి తమకు చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ, ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం నమాజ్ నిర్వహించి, తమ సొంత తల్లి సమాధి పక్కనే ఆదిలక్ష్మికి కూడా సమాధి నిర్మించారు. ఆమెకు తమ కుటుంబ సభ్యురాలిగా, పెంపుడు తల్లిగా అత్యున్నత గౌరవం ఇచ్చారు. ఈ ఘటన కోనసీమలో చర్చనీయాంశమైంది. విదేశాలకు వెళ్లిన ఓ మహిళకు ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, చింతలపల్లి గ్రామంలో ఆదిలక్ష్మి ఫోటోను ఇంటి ముందు ఉంచి ఆమె కుమారులు, కుమార్తె, కుటుంబ సభ్యులు కన్నీటి నివాళులు అర్పించారు. ఒక సాధారణ మహిళగా విదేశాలకు వెళ్లి, అక్కడ ఓ కుటుంబానికి తల్లిగా మారి, చివరికి అదే కుటుంబం మధ్య శాశ్వత నిద్రలోకి జారుకున్న ఆదిలక్ష్మి జీవితం అందరినీ కదిలిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
