Prakasam: దట్టమైన ముళ్ల పొదల నుంచి చప్పుళ్లు.. అటుగా వెళ్లేవారు ఆగి చూడగా..
ప్రాణాపాయ స్థితిలో ముళ్ల పొదల్లో చిక్కుకున్న జింక పిల్లను ప్రకాశం జిల్లా పోలీసులు చాకచక్యంగా రక్షించారు. గాయపడిన ఆ జింకకు ప్రాథమిక చికిత్స అందించి అటవీ శాఖ అధికారులకు అప్పగించగా, ఎస్ఐ నాగరాజు సేవలను గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. పూర్తి వివరాలు కథనంలో ..

పోలీసులంటే కేవలం శాంతిభద్రతలను కాపాడటమే కాదు, ఆపదలో ఉన్న మూగజీవాలను రక్షించడంలోనూ ముందుంటారని ప్రకాశం జిల్లా పోలీసులు నిరూపించారు. బల్లికురవ మండలం మల్లయ్యపాలెం గ్రామ సమీపంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక జింక పిల్లను పోలీసులు చాకచక్యంగా రక్షించి తమ ఉదారతను చాటుకున్నారు.
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం మల్లయ్యపాలెం సమీపంలోని పొలాల దగ్గర దట్టమైన ముళ్ల పొదల్లో ఒక జింక పిల్ల చిక్కుకుపోయింది. అటుగా వెళ్తున్న స్థానికులు దీనిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే బల్లికురవ ఎస్ఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దట్టమైన ముళ్ల చెట్ల మధ్య ఇరుక్కుపోయి, బయటకు రాలేక విలవిలలాడుతున్న జింక పిల్లను పోలీసులు అతి కష్టం మీద బయటకు తీశారు. అయితే, ఆ జింక పిల్ల కాలికి తీవ్ర గాయం కావడంతో అది కనీసం నిలబడలేని, నడవలేని స్థితిలో ఉంది.
గాయపడిన జింక పిల్లను ఎస్ఐ నాగరాజు అక్కున చేర్చుకున్నారు. దానికి ప్రాథమిక చికిత్స అందేలా చూసి, అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకోగా, ఎస్ఐ నాగరాజు స్వయంగా ఆ జింక పిల్లను వారికి అప్పగించారు. అటవీ శాఖ సిబ్బంది ఆ జింక పిల్లకు మెరుగైన వైద్యం అందించి, కోలుకున్న తర్వాత సురక్షిత ప్రాంతంలో వదిలిపెడతామని తెలిపారు. సమయానికి స్పందించి ఒక మూగజీవి ప్రాణాన్ని కాపాడిన ఎస్ఐ నాగరాజును, పోలీసు సిబ్బందిని మల్లయ్యపాలెం గ్రామస్తులు , నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
